సినిమా ఫలితం ఎలా ఉన్న సంగీతంతో అలరిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాజాగా తమన్ తన బీజీఎమ్తో మెస్మరైజ్ చేసిన సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. "విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్లో మరింత బాధ్యతగా పని చేస్తాం" అని అన్నారు.
"ఓజీ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్ నా సోదరుడు లాంటివాడు. రెండేళ్లు కలిసి ప్రయాణం చేశాం. కథ విన్నప్పుడే.. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను" అని తమన్ తెలిపారు.
"పవన్ కల్యాణ్ గారిని ఇలాంటి కథలో, ఈ తరహా పాత్రలో చూడాలనేది నాలాంటి ఎందరికో డ్రీమ్. ఓజీ సినిమాతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ముందుగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కారకులైన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది" అని తమన్ పేర్కొన్నారు.
"పవన్ కల్యాణ్ గారి సినిమాకి పని చేయడం అనేది డ్రీమ్. నాకు త్రివిక్రమ్ గారితో పని చేయడానికి వంద సినిమాలు పట్టింది. అలాగే పవన్ గారితో పని చేయడానికి కూడా వంద సినిమాలు పట్టింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కల్యాణ్ గారికి సినిమాలకు పని చేసే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. నటుడిగా ఆయనను అభిమానిస్తాను, నాయకుడిగా గౌరవిస్తాను" అని ఎస్ఎస్ తమన్ చెప్పారు.
"పవన్ కల్యాణ్ గారు 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యి ఎంత హై ఇచ్చారో.. ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము. రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము. మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు" అని తమన్ అన్నారు.
"నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను. నీ వెనుక మేమున్నాం అంటూ దానయ్య గారు, కళ్యాణ్ గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నవీన్ నూలిది, నాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. నవీన్ ఈ సినిమాకి పని చేయడం అదనపు బలం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు" అని తమన్ చెప్పుకొచ్చారు.
"పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది అభిమానుల విజయం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రియాంక మోహన్ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని తమన్ తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం