దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతోన్నారు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ను సొంతం చేసుకున్నది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు మూవీగా చరిత్రను తిరగరాసింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఈగ, మగధీరతో పాటు మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులను నెలకొల్పాయి. నేషనల్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలను దక్కించుకున్నది.
స్టూడెంట్ నంబర్ వన్ మినహా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించడం గమనార్హం. . విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్లో అగ్ర రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
జానకి రాముడు సినిమాతో కథా రచయితగా విజయేంద్రప్రసాద్ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఘరానా బుల్లోడు, సమర సింహారెడ్డి, బొబ్బిలి సింహం, బంగారు కుటుంబం లాంటి సినిమాలతో రైటర్గా పెద్ద విజయాలను అందుకున్నాడు విజయేంద్రప్రసాద్.
రైటర్గా ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ను ఇచ్చిన విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా మాత్రం అన్ని డిజాస్టర్లే ఎదుర్కొన్నారు.
కథారచయితగా సక్సెస్లతో దూసుకుపోతున్న టైమ్లోనే విజయేంద్రప్రసాద్ అర్ధాంగి సినిమాతో 1996లో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్తో పాటు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కూడా మరో దర్శకుడిగా పనిచేశారు. ఆనంద్, రవళి జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్గా నిలిచింది. అప్పట్లోనే నిర్మాతకు దాదాపు తొంభై లక్షల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు మెగాఫోన్కు దూరంగా ఉన్నారు విజయేంద్రప్రసాద్. 2006లో రిలీజైన శ్రీకృష్ణ 2006 మూవీతో డైరెక్టర్గా రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాంత్, వేణు హీరోలుగా నటించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆ తర్వాత నాగార్జున హీరోగా తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రాజన్న సినిమాను తెరకెక్కించాడు విజయేంద్రప్రసాద్. కమర్షియల్గా ఈ మూవీ ఫెయిలైనా ఆరు నంది అవార్డులను మాత్రం దక్కించుకున్నది.
రాజన్న తర్వాత ప్రయోగాత్మక కథాంశంతో రూపొందిన శ్రీవల్లి సినిమాకు విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ రిలీజైన విషయం తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. శ్రీవల్లి తర్వాత మళ్లీ డైరెక్షన్ వైపు అడుగులు వేయలేదు విజయేంద్రప్రసాద్.
సంబంధిత కథనం