సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ గ్లోబల్ రేంజ్ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ అడ్వెంచర్ యాక్షన్ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అయితే, ఈ సినిమా వర్కింగ్ టైటిల్కు కూడా క్లారిటీ వచ్చేసింది.
మహేశ్ - రాజమౌళి మూవీకి షూటింగ్ కొంతకాలంగా ఒడిషాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఇప్పుడు ఫినిష్ అయింది. ఒడిషాలోని కోరపుట్ ప్రాంతంలో సుమారు 15 రోజుల పాటు ఎస్ఎస్ఎంబీ29 చిత్రీకరణ సాగింది. ఒడిషాలో షెడ్యూల్ పూర్తైన సందర్భంగా అక్కడ కొందరు అభిమానులు, స్థానిక అధికారులతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా ఫొటోలు కూడా దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేశ్ బాబు - రాజమౌళి చిత్రానికి వర్కింగ్ టైటిల్ ఏదనే విషయంపై కొద్ది రోజులు చాలా చర్చ జరిగింది. మహేశ్ బాబుకు 29వ చిత్రం కావడంతో ‘ఎస్ఎస్ఎంబీ29’ అని కొందరు అంటే.. ఇద్దరి కాంబినేషన్ కలిపి ‘ఎస్ఎస్ఆర్ఎంబీ’ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. ఇప్పుడు రాజమౌళి రాసిన నోట్తో దీనిపై క్లారిటీ వచ్చేసింది.
ఒడిషా షెడ్యూల్ పూర్తైన సందర్భంగా రాజమౌళి..ఓ థ్యాంక్స్ నోట్ రాశారు. “డియర్ కోరట్పూర్. అద్భుతమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఇలాంటి అడ్వెంచర్స్ మరిన్ని ఉండాలని అనుకుంటున్నా. ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ నుంచి ప్రేమతో” అంటూ రాసి రాజమౌళి సంతకం పెట్టినట్టు ఓ ఫొటో బయటికి వచ్చింది. దీంతో ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ29 అని క్లారిటీ వచ్చేసింది.
ఈ గ్లోబల్ రేంజ్ మూవీ ప్రాజెక్ట్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ29 అని పూర్తిగా తమ హీరో పేరు మీదే ఉండటంతో మహేశ్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఇచ్చిన క్లారిటీ ఖుషీ అవుతున్నారు. మహేశ్ రేంజ్ అదీ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై భారీగా ట్వీట్స్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఈ చిత్రానికి మెయిన్ టైటిల్ను మూవీ టీమ్ ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి.
ఒడిషా షూటింగ్ స్పాట్ నుంచి ఇటీవల ఓ వీడియో లీక్ అయింది. దీనిపై రాజమౌళి సీరియస్ అయినట్టు టాక్ వచ్చింది. సెక్యూరిటీని కూడా పెంచేశారని తెలిసింది. ఇప్పుడు ఒడిషా షెడ్యూల్ కంప్లీట్ కావడంతో.. హైదరాబాద్లో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.
మహేశ్ బాబు - రాజమౌళి చిత్రం సుమారు రూ.1000కోట్ల భారీ బడ్జెట్తో రూపొందనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీకి మైథలాజీ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
సంబంధిత కథనం