వాళ్లంతా టెర్రరిస్టులే: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు-singer chinmayi post on pahalgam terror attack netizens furious over her terrorists comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  వాళ్లంతా టెర్రరిస్టులే: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

వాళ్లంతా టెర్రరిస్టులే: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

Hari Prasad S HT Telugu

సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సమయం, సందర్భం లేకుండా పహల్గాం ఉగ్రదాడి సమయంలో కులాన్ని తెరపైకి తెచ్చేలా ఆమె చేసిన పోస్ట్ పై నెటిజనట్లు మండిపడుతున్నారు. పైగా అగ్రకులాల వారిని ఉగ్రవాదులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

వాళ్లంతా టెర్రరిస్టులే: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

సింగర్ చిన్మయి శ్రీపాద తెలుసు కదా. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కడం ఈమెకు అలవాటే. తాజాగా దేశమంతా సెలబ్రిటీలతో సహా జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ చిన్మయి మాత్రం అదే సమయంలో అగ్ర కులాల వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ పోస్ట్ చేసింది. దీనిపై ప్రస్తుతం పలువురు మండిపడుతున్నారు.

చిన్మయి పోస్ట్ ఏంటంటే?

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. అయితే సింగర్ చిన్మయి శ్రీపాద మాత్రం దేశంలో కులం పేరుతో అవతలి వాళ్లను చిన్నచూపు చూసే వాళ్లు కూడా ఉగ్రవాదులతో సమానమే అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఏముందో చూడండి.

“నేను ఓ నిమ్న కులానికి చెందిన అంటే షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని. హిందువులమని చెప్పుకునే వాళ్లు నేనూ వాళ్లలో ఒకరిని అని మరిచిపోతుంటారు. మా ఊళ్లో నా చిన్నతనంలో గుడిలో పూజారి నా చేతికి నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. కాలేజీ రోజుల్లోనూ రిజర్వేషన్లు వాడుకొని తమ నెత్తిపై కూర్చొంటున్నామని ఓ ప్రొఫెసర్ నాతో అన్నారు. నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఇది చెప్పడం కాస్త బాధగానే ఉంటుంది.

కానీ చాలాసార్లు నా చుట్టూ ఉన్న అగ్రకులానికి చెందిన వాళ్లు, కులం ఆధారంగా చిన్నచూపు చూసే వాళ్లు కూడా ఉగ్రవాదులతో సమానమే. ఎందుకంటే వాళ్లు నా మానిసిక ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీశారు. కానీ కులం ఆధారిత సినిమాలు ఇప్పటి వరకూ రాలేదు. వాళ్లిద్దరి మధ్య తేడా ఏమీ లేదు. ఒకరు మతం ఆధారంగా చంపుతున్నారు. మరొకరు ఆధిపత్యంతో మానసిక ఆరోగ్యాన్ని చంపుతున్నారు” అని చిన్మయి పోస్ట్ చేసింది.

సమయం సందర్భం ఉండొద్దా?

చిన్మయి చేసిన ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇలాంటి పోస్టులకు సమయం, సందర్భం ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పోస్టులు చేయడంలో నీ ఉద్దేశమేంటని అడుగుతున్నారు. మరికొందరు కేవలం నిమ్న కులం వాళ్లే కాదు.. అగ్రకులాల్లోని వాళ్లు కూడా వివక్ష ఎదుర్కొంటున్నారని ఆమె పోస్టుపై కామెంట్స్ చేశారు.

కేవలం ఎస్సీ, ఎస్టీలే వివక్ష ఎదుర్కోవడం లేదని చిన్మయికి చెబుతున్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక్క పోస్టు చేయని ఆమె.. ఇలా కుల వివక్ష అంటూ అగ్రకులాల వారిని ఉగ్రవాదులతో పోల్చడం ఏంటని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం