Telugu Re Release Movies: ఈ నెలలో రీ రిలీజ్ కానున్న టాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీస్ ఇవే
Telugu Re Release Movies: ఈ నెలలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన బ్లాక్బస్టర్ మూవీస్ రీ రిలీజ్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
రామ్ రెడీ
హీరో రామ్ (Ram Pothineni) డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన రెడీ మూవీ మే 14న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్కు లవ్, కామెడీని జోడించి శ్రీనువైట్ల రూపొందించిన రెడీ సినిమా రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో రామ్, జెనీలియా కెమిస్ట్రీతో పాటు బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకుల్ని అలరించాయి.
రెడీ రిలీజై పదిహేనేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. భారీ కలెక్షన్స్తో పాటు రెడీ మూవీ మూడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నది . రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన తర్వాత రామ్ నుంచి విడుదలవుతోన్న మొదటి సినిమా ఇదే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ను భారీగానే ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది. మరో నాలుగైదు రోజుల్లో రెడీ మూవీ రీ రిలీజ్బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ డబుల్ బొనాంజా
ఎన్టీఆర్ (Ntr) పుట్టినరోజు సందర్భంగా మే 20న అతడు హీరోగా నటించిన సింహాద్రితో పాటు ఆది సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఎన్టీఆర్, రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి (Simhadri) మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా నిలిచింది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇందులో సింహాద్రిగా, సింగమలైగా మాస్, క్లాస్ వేరియేషన్స్తో కూడిన క్యారెక్టర్లో ఎన్టీఆర్ అసమాన నటనతో అభిమానులను మెప్పించాడు. సింహాద్రి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపి 300లకుపైగా థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. ఈ స్క్రీన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ థియేటర్లో సింహాద్రి రీ రిలీజ్ కానుంది. సింహాద్రి రీ రిలీజ్ కలెక్షన్స్ను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించబోతున్నారు. సింహాద్రి సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో నటించింది.
సింహాద్రితో పాటు ఎన్టీఆర్ ఆది అదే రోజు రిలీజ్ కానుంది. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ను మాస్ హీరోగా నిలబెట్టింది. ఆది సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు. కీర్తి చావ్లా హీరోయిన్గా నటించింది.