కన్నడ అగ్ర హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి ఓ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ చేస్తోన్నారు. 45 అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రాజ్ బి శెట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తున్నారు. 45 మూవీ తెలుగు టీజర్ను ఇటీవల లాంఛ్ చేశారు. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ "45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఈ మూవీలో నా ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. అర్జున్ జన్యా వందకు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది.
45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని" అని చెప్పారు. .
హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ"దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను.
ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఉపేంద్ర సినిమానే లోకంగా బతుకుతుంటాడు. 45 సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు హీరో. కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను.
నాకు మా మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్నారు కానీ నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా క్యారెక్టర్ కు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను. రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తున్నాను. రజినీకాంత్ కోసమే జైలర్ సినిమా చేశా. జైలర్ 2లో నటిస్తున్నా" అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ "45 మూవీని శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో చేయడం సంతోషంగా ఉంది. సనాతన ధర్మ కాన్సెప్ట్తో ఈ మూవీ రూపొందించారు. శివరాజ్కుమార్ కుమార్కు కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు నువ్వే డైరెక్షన్ చేయి అని ఎంకరేజ్ చేశారు. ఆయన మాటతోనే ఈ సినిమాకు దర్శకత్వం చేసే కాన్ఫిడెన్స్ వచ్చింది.
శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు. ఉపేంద్రను ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు. ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ ఆదా అవుతుంది" అని పేర్కొన్నారు. 45 సినిమాను సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం