Bollywood: షారుఖ్-సల్మాన్ ఒకే తెరపై.. 27 ఏళ్ల తర్వాత కలయిక..!-shah rukh and salman will working together for biggest action film by aditya chopra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh And Salman Will Working Together For Biggest Action Film By Aditya Chopra

Bollywood: షారుఖ్-సల్మాన్ ఒకే తెరపై.. 27 ఏళ్ల తర్వాత కలయిక..!

Maragani Govardhan HT Telugu
Jul 05, 2022 10:49 AM IST

షారుఖ్, సల్మాన్ కలిసి ఒకే సినిమాలో పనిచేయబోతున్నారా.. అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వీరిద్దరూ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా రూపొందిస్తున్నారట.

షారుఖ్-సల్మాన్
షారుఖ్-సల్మాన్ (Twitter)

బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టారడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కలిసి నటించిన వీరిద్దరూ తర్వాత ఎవరి చిత్రాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు 27 ఏళ్ల తర్వాత ఒకే తెరను పంచుకోనున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. దిల్ వాలే దుల్హానీయా లేజాయింగే లాంటి సూపర్ హిట్‌ను తెరకెక్కించిన ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి కథను రాస్తున్నారట. ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద చిత్రంగా ఇది రూపొదిద్దుకోనుందట. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనుందని సమాచారం.

బాలీవుడ్ రిపోర్టుల ప్రకారం.. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి షారుఖ్, సల్మాన్.. నిర్మాతతో చర్చించారని, ఇద్దరినీ లీడ్ రోల్స్ కోసం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమా భారత్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.

వీరిద్దరూ చివరగా.. 2019లో షారుఖ్ నటించిన జీరో చిత్రంలో కనిపించారు. ఇసఖ్‌బాజీ అనే పాటలో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించారు. కానీ ఇద్దరూ ఒకే తెరపై పూర్తి స్థాయిలో కనిపించి రెండు దశాబ్దాలు దాటిపోయింది. కరణ్-అర్జున్ సినిమాలో వీరిద్దరూ పూర్తి స్థాయి పాత్రలు చేశారు. అనంతరం వచ్చిన కుచ్ కుచ్ హోతా హైలోనూ సల్మాన్ ప్రత్యేక పాత్రలో మెరిశారు. దీంతో ఇద్దరూ మరోసారి కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరే కాదు.. ఖాన్‌లు ముగ్గురు ఒకే తెరను పంచుకుంటే చూడాలని ఆశపడుతున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

మా ముగ్గురికి సరిపోయే పారితోషికం ఇవ్వగలిగితే.. సినిమా చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. కానీ ముగ్గురం కలిసి నటించాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మా ముగ్గురి పనితీరు ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అయితే నిర్మాత మమ్మల్ని భరించగలిగితే భవిష్యత్తులో సాధ్యపడే అవకాశముంటుంది. అని షారుఖ్ అన్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన షారుఖ్.. సల్మాన్‌తో కలిసి నటించే అనుభవం గురించి తెలిపారు. సల్మాన్‌తో పనిచేసినట్లుగా కాకుండా.. ప్రేమ, ఆనందం కలగలిపిన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం షారుఖ్ పఠాన్ అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తాప్సీ సరసన ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారు. మరోపక్క సల్మాన్.. కబీ ఈద్ కబీ దివాలీ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది. ఈ డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.