సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏ ముహూర్తంలో రిలీజైందోగానీ అప్పుడు థియేటర్లలో, తర్వాత ఓటీటీలోనూ తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంటోంది. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా తాజాగా జీ5 ఓటీటీలో కళ్లు చెదిరే రికార్డును సొంతం చేసుకుంది. మరి ఆ రికార్డు ఏంటో చూడండి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ5 ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. గతంలో కేవలం ఆర్ఆర్ఆర్ మూవీకి మాత్రమే దక్కిన ఘనత ఇది. ఆ సినిమా ఒక బిలియన్ కు పైగా స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ అరుదైన మైలురాయిని అందుకున్నట్లు జీ5 ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు బ్రేకింగ్ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్. సంక్రాంతికి వస్తున్నాం మూవీని ఓ అద్భుతమైన బ్లాక్బస్టర్ గా మార్చినందుకు జీ5 ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.
అయితే జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్ మూవీ నమోదు చేసిన రికార్డుకు ఇంకా చాలాదూరంలోనే సంక్రాంతికి వస్తున్నాం ఉంది. ఆర్ఆర్ఆర్ ఏకంగా 1 బిలియన్ అంటే 100 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేయడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం ప్రస్తుతం 50 కోట్ల (500 మిలియన్లు) దగ్గరే ఉంది. అంటే అందులో సగం మాత్రమే.
ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25, 2022లో థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత అంటే మే 20 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అదే జీ5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. మార్చి 1 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 45 రోజుల్లోనే ఆ మూవీ ఈ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.
సంబంధిత కథనం