స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తానా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాలో తానా 2025 వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. తానా వేదికపై మాట్లాడిన సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తానా స్టేజీపై సమంత మాట్లాడుతూ.. "తానా వేదికపై నిలబడే అవకాశం రావడం నా జీవితంలో ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నా. ఈ స్టేజీపై నిలబడటానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది తానా గురించి, ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉన్నాను. కానీ, ఇక్కడికి వచ్చి మీరు చూపిన ప్రేమకు థ్యాంక్స్ చెప్పడం ఇవాళే సాధ్యమైంది"అని అన్నారు.
"నా తొలి సినిమా ఏ మాయ చేశావేతో నన్ను మీ మనిషిలా భావించారు. మీ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించారు. అప్పటి నుంచి మీరు నాకు నిరంతరంగా ప్రేమ, సపోర్ట్ ఇస్తున్నారు. దానికి మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇన్నేళ్లు పెట్టింది" అని శిరస్సు వంచి నమస్కారం చేసింది సమంత.
"కెరీర్ పంరగా ముఖ్యమైన స్టేజీలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించా. ప్రొడ్యూసర్గా శుభంతో మొదటి అడుగు వేశాను. నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వారు మా సినిమాను ఎంతగానే ప్రశంసించారు. మంచి ఫలితాన్ని ఇచ్చారు" అని సమంత తెలిపింది.
"జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా.. మీరు ఎప్పుడు నా వెంటే ఉన్నారు. అందుకు గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ ఇండస్ట్రీలో పని చేసినా.. తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా లేదా అనే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల నా జర్నీలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు" అని సమంత పేర్కొంది.
"మీరు నాకొక గుర్తింపు (ఐడెంటిటీ), కుటుంబాన్ని ఇచ్చారు. ఓ బేబీ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం మీ వల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు. కానీ, మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారు" అని ఒక్కసారిగా ఎమోషనల్ అయిన సమంత కంటతడి పెట్టుకుంది.
ప్రస్తుతం సమంత ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. అలాగే, సమంత రూత్ ప్రభు చేసిన కామెంట్స్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
సంబంధిత కథనం