చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘సైయారా’ (Saiyaara) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పెద్ద పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేసింది. బడా బడా స్టార్లకు సాధ్యం కాని రికార్డును ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లలో అదరగొడుతోంది. థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి కలెక్షన్ల దుమ్ము రేపుతూనే ఉంది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన లవ్ స్టోరీగా హిస్టరీ క్రియేట్ చేసింది.
మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన సైయారా చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. కేవలం 11 రోజుల్లోనే ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథా చిత్రంగా నిలిచింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన సైయారా.. షాహిద్ కపూర్ సినిమా కబీర్ సింగ్ (రూ.379 కోట్లు), అమీర్ ఖాన్ ఫిల్మ్ సితారే జమీన్ పర్ (రూ.264 కోట్లు) సినిమాల లైఫ్టైమ్ గ్లోబల్ కలెక్షన్లను అధిగమించింది. సైయారా సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు మాత్రమే.
సైయారా తాజా ప్రపంచవ్యాప్త వసూళ్లను యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పంచుకుంది. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా కలెక్షన్లు రూ.318 కోట్లు కాగా.. ఓవర్సీస్ రూ.86 కోట్లు రాబట్టింది.
సైయారా చిత్రం ఆషికి 2, మర్డర్ 2, హాఫ్ గర్ల్ఫ్రెండ్, ఏక్ విలన్ వంటి ఇతర ప్రధాన రొమాంటిక్ హిట్లను కూడా వెనక్కి నెట్టింది. ఇవన్నీ మోహిత్ సూరి గతంలో తీసిన విజయవంతమైన చిత్రాలే. ప్రారంభ రోజున రూ.21.25 కోట్ల వసూళ్లతో సైయారా చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుందని సంకేతాలు ఇచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి ఇండియాలో ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన రొమాంటిక్ చిత్రంగా నిలిచింది.
హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కొత్త నటీనటులు, చార్ట్బస్టర్ సంగీతం, మోహిత్ సూరి ప్రత్యేక కథ చెప్పే విధానం సైయారా సినిమాకు విస్తృత ఆదరణను తెచ్చిపెట్టాయి. పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా ఈ మూవీ ఈ సంవత్సరం విడుదలైన భారీ బడ్జెట్, స్టార్-డ్రైవెన్ చిత్రాలను సైతం అధిగమించింది. ప్రేక్షకుల మద్దతు, బలమైన ఓవర్సీస్ కలెక్షన్లు, ట్రెండింగ్ మ్యూజిక్తో సైయారా త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాలకు ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ప్రేమకథలు ఇప్పటికీ బాక్సాఫీస్ను ఏలగలవని నిరూపించింది.
ప్రతిష్టాత్మక జర్నలిస్ట్ అయిన వాణి, పాటలంటే ప్రాణమైన క్రిష్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది. వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథ.
సంబంధిత కథనం
టాపిక్