sai pallavi: నా మాటలను వక్రీకరించారు...వివాదంపై వివరణ ఇచ్చిన సాయిపల్లవి...
విరాటపర్వం ప్రమోషన్స్ లో తాను మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరించారని సాయిపల్లవి అన్నది. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే తాను చెప్పింది ఏమిటో అందరికీ అర్థమవుతుందని అన్నది. తాను ఎప్పుడూ న్యూట్రల్ గానే మాట్లాడుతానని పేర్కొన్నది. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
విరాటపర్వం ప్రమోషన్స్ లో కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పండిట్ హత్యలకు, గోహత్యలకు తేడా లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ తో పాటు పలు రాజకీయ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో నాలుగు నిమిషాల నిడివితో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.
సినిమాల గురించి కాకుండా ఓ విషయంపై వివరణ ఇవ్వడానికి అభిమానుల ముందుకు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నది. తన మనసులో ఉన్న మాటలను చెప్పడానికి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాల్సివస్తుందని చెప్పింది. తన వ్యాఖ్యల వల్ల ఎవరైన ఇబ్బంది పడి ఉంటే క్షమించమని సాయిపల్లవి అన్నది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్ కు మద్దతు ఇస్తారా...రైట్ కు మద్దతు ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు తాను న్యూట్రల్ అని సమాధానం చెప్పానని సాయిపల్లవి అన్నది. విశ్వాసాలు,నమ్మకాల ఏర్పరచుకోవడానికంటే ముందు మనమంతా మంచి మనుషులుగా ఉండటం ముఖ్యమని సాయిపల్లవి తెలిపింది.
ఈ విషయాల్ని గురించి ఇంటర్వ్యూలో వివరించే ముందు తనను కలిచివేసిన రెండు రిఫరెన్స్ ల గురించి చెప్పానని సూచించింది. ‘కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత మూడు నెలల క్రితం చిత్ర దర్శకుడితో మాట్లాడే అవకాశం వచ్చింది. అందులో బాధితులు ఎదుర్కొన్న సమస్యలు చూసి డిస్ట్రబ్ అయ్యానని దర్శకుడితో చెప్పాను. ఈ మారణహోమం తాలుకూ ప్రభావం వల్ల ఇప్పటికీ ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు.అలాగే కొవిడ్ సమయంలో జరిగిన మూక హింస లకు సంబంధించిన వీడియోలు చూసి చాలా బాధ కలిగింది హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని నేను నమ్ముతా. ఇతరుల ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదు’ అని సాయిపల్లవి అన్నది.
మెడికల్ గ్రాడ్యూయేట్ గా అందరి ప్రాణాల ఒక్కటే అని తాను భావిస్తానని సాయిపల్లవి తెలిపింది. కానీ చాలా మంది ఆన్ లైన్ లో మాబ్ లించింగ్ లను సమర్ధించడం బాధను కలిగించిందని పేర్కొన్నది. 14 ఏళ్లపాటు సాగిన తన పాఠశాల జీవితంలో ప్రతి రోజు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటూ ప్రార్థనలు చేస్తూ పెరిగానని సాయిపల్లవి పేర్కొన్నది. ఆ ప్రార్థనలన్నీ తన మనసులో బలంగా నాటుకుపోయాయని తెలిపింది.
కుల,మత,సంస్కృతుల పరంగా మనుషులను విభజించి చూడటం సరికాదని తాను నమ్ముతున్నట్లు చెప్పింది. తాను ఎప్పుడూ న్యూట్రల్ గానే మాట్లాడుతానని అన్నది. ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాటలను పూర్తిగా తప్పుడు కోణంలో చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను మాట్లాడిన కొన్ని మాటలను మాత్రమే స్నిప్పెట్ ల ద్వారా చూపిస్తున్నారని చెప్పింది. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే నిజాయితీగా తాను చెప్పిన మాటలు అందరికీ అర్థమవుతాయని అన్నది. నేను ఏ తప్పు చేశానో తెలియడం లేదని అన్నది. క్లిష్ట పరిస్థితుల్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సాయిపల్లవి అన్నది.
సంబంధిత కథనం
టాపిక్