Sai Durgha Tej SDT 18 First Look: విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ను నిర్మాతలు శుక్రవారం విడుదల చేశారు.
ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందుతుతన్నట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "ఈ చిత్రం గ్రాండ్ స్కేల్తో, భారీ బడ్జెట్తో రూపొందుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది" అని తెలిపారు.
"ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్తో ప్రస్తుతం ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" దర్శకనిర్మాతలు వెల్లడించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా రానుంది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ చిత్రంగా ఎస్డీటీ 18 (SDT 18) వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది.
ఇదిలా ఉంటే, మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత నటించిన విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం బ్రో సినిమా యావరేజ్గా నిలిచిన కలెక్షన్లతో సత్తా చాటింది.
ఇలా విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు ఈ మెగా సుప్రీమ్ హీరో. అయితే, సాయి ధరమ్ తేజ్ ఈ ఎస్డీటీ 18 కంటే ముందుగా గాంజా శంకర్ అనే మూవీ చేయాల్సింది. ఇందులో గాంజా అమ్మే వ్యక్తిగా సాయి తేజ్ కనిపించాడు. దానికి సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే పలు వివాదాలు కూడా తెచ్చుకుంది.
గాంజా శంకర్ సినిమాపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ సినిమా పూర్తిగానే ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిద్దామనుకున్న ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించాల్సింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించాలనుకున్న ఈ సినిమా ఆగిపోవడంపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.