తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సింగింగ్ షో భారీ వ్యూస్ సాధిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తీక్, గీతామాధురి జడ్జిలుగా ఉన్నారు. ఈ సింగింగ్ షోకు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గెస్టుగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆహా వెల్లడించింది. ఈ ఎపిసోడ్లు ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తాయో కూడా వెల్లడించింది.
తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్ వేదికపైకి నేషనల్ క్రష్ వచ్చేశారంటూ ఆహా ఓటీటీ నేడు (జూలై 30) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్మిక మందన్నా గెస్టుగా వచ్చారని వెల్లడించింది. “మాకు తెలుసు మీరు కనిపెట్టేశారని. ఇంకెందుకు సీక్రెట్. ఇదుగో మన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా” అని ఆహా ట్వీట్ చేసింది.
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్పై రష్మిక డ్యాన్స్ చేశారు. ఈ షో యాంకర్గా ఉన్న సింగర్ శ్రీరామచంద్రతో కలిసి స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ఆహా పోస్ట్ చేసింది. అలాగే, గులాబీలు పట్టుకొని రష్మిక క్యూట్గా నవ్వుతున్న ఫొటోను షేర్ చేసింది. త్వరలోనే ఈ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోను ఆహా తీసుకురానుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో రష్మిక మందన్నా గెస్టుగా పాల్గొన్న 15,16వ ఎపిసోడ్లు ఆగస్టు 2, ఆగస్టు 3వ తేదీల్లో సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తాయి. ఈ విషయాన్ని ఆహా వెల్లడించింది.
తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ జూన్ 14వ తేదీన మొదలైంది. 12 కంటెస్టంట్లతో షురూ అయింది. ఆహా ఓటీటీలో ప్రతీ శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు కొత్త ఎపిసోడ్లు స్ట్రీమింగ్కు వస్తున్నాయి. గత రెండు సీజన్లలాగే ఈ మూడో సీజన్కు కూడా మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఆహాలో ట్రెండింగ్స్లో ఈ షో నిలుస్తూనే ఉంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్కు గెస్టుగా వచ్చారు. జూలై 5,6 తేదీల్లోనే ఈ ఎపిసోడ్లు స్ట్రీమ్ అయ్యాయి. నెల ముగియకుండానే ఇప్పుడు రష్మిక కూడా ఈ షోకు వచ్చేశారు. విజయ్, రష్మక మధ్య ప్రేమ నడుస్తోందని చాలా కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఈ ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అయితే, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెకేషన్ ఫొటోలతో హింట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్కు నెల వ్యవధిలోనే గెస్టులుగా విజయ్, రష్మిక వచ్చారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 ది రూల్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులోనే రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలకు కూడా రష్మిక ఓకే చెప్పారు. బాలీవుడ్లో చావా, సికిందర్ సినిమాలు కూడా చేస్తున్నారు.