రణ్బీర్ కపూర్, యష్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం మూవీ నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింప్స్ జూలై 3న విడుదలైంది. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్, బీజీఎం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ నట విశ్వరూపం ప్రదర్శించారని అంటున్నారు. ముఖ్యంగా రణ్బీర్ కపూర్ ను యశ్ డామినేట్ చేశారని చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి.
రామాయణం గ్లింప్స్ వచ్చిన వెంటనే ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్ మోత మోగుతోంది. ఎందుకంటే ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్.. యూట్యూబ్లో ఆ చిత్రం నుండి 'జై శ్రీరామ్' పాటను కూడా పంచుకుంది. దీని టైమింగ్ ఆన్లైన్లో విమర్శలను రేకెత్తిస్తోంది. 2023లో విడుదలైన ఆదిపురుష్ చిత్రాన్ని కూడా రామాయణం ఆధారంగానే రూపొందించారు. కృతి సనన్, ప్రభాస్, సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ చిత్రం నుండి 'జై శ్రీరామ్' పాట వీడియోను గురువారం మధ్యాహ్నం రామాయణం మొదటి గ్లింప్స్ విడుదలైన వెంటనే టీ-సిరీస్ అప్లోడ్ చేసింది.
ఆదిపురుష్ సాంగ్ టైమింగ్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “ఆదిపురుష్లో తన పెట్టుబడికి కొంత డబ్బును సంపాదించుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న భూషణ్కు నేను అభినందనలు చెప్పాలి” అని ఓ యూజర్ రాశాడు. మరొకరు “టైమింగ్ అసాధారణం—రామాయణం టీజర్ విడుదలైన వెంటనే. ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారా?’’ అని ప్రశ్నించాడు. “అసూయ అత్యధికంగా ఉంది”, ‘‘ఆ విమర్శలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారా’’ అని నెటిజన్లు అంటున్నారు.
రామాయణం టీజర్ విడుదలైన వెంటనే, సోషల్ మీడియా యూజర్లు ఓం రౌత్ ఆదిపురుష్తో పోలికలు చేయడం ప్రారంభించారు. నితేష్ తివారీ చిత్రం రామాయణం టీజర్ “ఆదిపురుష్ మొత్తం కంటే మెరుగైనది” అని చాలామంది భావించారు. రామాయణం హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ ను అభినందిస్తున్నారు. దీన్ని చూసి ఓం రౌత్ నేర్చుకోవాలని అంటున్నారు. రూ. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్లు మాత్రమే రాబట్టింది.
నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మాల్హోత్రా నిర్మిస్తున్న రామాయణం చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం దీపావళి 2026లో, రెండవ భాగం దీపావళి 2027లో విడుదల కానుంది.
సంబంధిత కథనం