Ram Charan with Priyanka Chopra: ప్రియాంక పార్టీకి వెళ్లిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Ram Charan with Priyanka Chopra: ప్రియాంక చోప్రా హోస్ట్గా వ్యవహరించిన పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి హాజరయ్యారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రియాంకకు ఉపాసన కృతజ్ఞతలు చెప్పారు.
Ram Charan with Priyanka Chopra: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తోంది. ముందుగా రామ్ చరణ్, రాజమౌళి అక్కడకు చేరుకోగా.. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ సంస్థ ప్రీ ఆస్కార్ పార్టీని నిర్వహించింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. మలాల యూసుఫ్తో హోస్ట్ చేసిన ఓ ఈవెంట్కు రామ్ చరణ్ హాజరయ్యారు.
దక్షిణాసియాకు చెందిన చిత్రాలు ఆస్కార్కు నామినేట్ అయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చింది పారామౌంట్ సంస్థ. ఈ కార్యక్రమానికి దక్షిణాసియాకు చెందిన నటులు, నిపుణలు, ఆస్కార్ నామినీస్, ఇతర సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ సతీసమేతంగా ఈ పార్టీకి వెళ్లారు. అక్కడ ప్రియాంక చోప్రాతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకు ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధన్యవాదాలను తెలియజేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు," అని తెలిపారు. తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేసుకున్నారు.
వరుస ఇంటర్వ్యూల్లో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ పార్టీకి సమయాన్ని కేటాయించి హాజరయ్యారు. వీరితో పాటు అంజుల ఆచార్య, మిండి కలింగ్, కుమైల్ నంజైని, కల్ పెన్, అజీజ్ అన్సారీ, బెలా బజ్రియా, రాధికా జోన్స్, జోసెఫ్ పటేల్, శృతి గంగూలీ, అనిత చటర్జీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రియాంకతో కలిసి రామ్ చరణ్ దంపతులు ఫొటోలు దిగారు. ఇప్పటికే చరణ్తో కలిసి ప్రియాంక జంజీర్(తెలుగులో తుఫాన్) అనే సినిమాలో కలిసి నటించింది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఉండటంతో చరణ్ను సాదరంగా ఆహ్వానించింది ప్రియాంక.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ హవానే నడుస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్కు నామినేట్ కావడంతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న జరగనుంది.