Rajendra Prasad Laggam Movie Launch: నట కిరీటి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు కామెడీ హీరోగా ఎవరు దక్కించుకోలేని క్రేజ్ సంపాదించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎన్నో చిత్రాలు నవ్వులుపండించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇటీవల కాలంలో మాత్రం హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్, పలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఏ పాత్ర చేసిన తనదైన స్టైల్తో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య సేనాపతి, గాలి సంపత్ వంటి ఓటీటీ సినిమాలతో సైతం అలరించారు.
ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం లగ్గం. సుభిశి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం మూవీకి డైరెక్టర్ రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ చెప్పాల ఇంతకుముందు భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు లగ్గం సినిమాకు రమేష్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. లగ్గం మూవీలో ప్రెషర్ కుక్కర్ ఫేమ్ సాయి రోనక్, గానవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా లగ్గం మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా డా. రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. "లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి. లగ్గం విందు భోజనంలాంటి సినిమా" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
"పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అని చెప్పే సినిమా లగ్గం. ఈ మూవీతో గట్టి దావత్ ఇవ్వబోతున్నాం" అని డైరెక్టర్ రమేష్ చెప్పాల పేర్కొన్నారు. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తుచేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది" అని హీరో సాయి రోనక్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే లగ్గం సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్గా, బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 5) నుంచి లగ్గం సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా ఈ సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచరపాలెం రాజు, సత్తన్న నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలో కామెడీ మూవీస్తో పాటు ఆ నలుగురు వంటి మేసెజ్ ఒరియెంటెడ్ టైప్ చిత్రాలు చేసి అలరించారు. ఆయన కెరీర్లో పెళ్లి పుస్తకం సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోని శ్రీరస్తు శుభమస్తు అనే పాట ఇప్పటికీ ప్రతి పెళ్లి ఫంక్షన్లో మారుమోగిపోతుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర, కామెడీ టైమింగ్, క్యారెక్టర్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.