PV Sindhu on Chiranjeevi: చిరు అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు పోస్ట్ వైరల్-pv sindhu instagram post on chiranjeevi ram charan viral mega family at paris olympics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pv Sindhu On Chiranjeevi: చిరు అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు పోస్ట్ వైరల్

PV Sindhu on Chiranjeevi: చిరు అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu

PV Sindhu on Chiranjeevi: చిరు అంకుల్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీతోపాటు తన తొలి మ్యాచ్ కు రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ స్టార్ అనడం విశేషం. మెగా ఫ్యామిలీ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే.

చిరు అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు పోస్ట్ వైరల్

PV Sindhu on Chiranjeevi: ఈసారి పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ తెలుగు వారికి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈ ఈవెంట్లో టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవితోపాటు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కూడా ఈ ఈవెంట్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈవెంట్ తర్వాత మెగా ఫ్యామిలీని కలిసిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

చిరు అంకుల్ ఆశ్చర్యపరిచాడు

మెగాస్టార్ చిరంజీవి ఓపెనింగ్ సెర్మనీతోపాటు తన తొలి మ్యాచ్ చూడటానికి రావడం గురించి పీవీ సింధు ప్రస్తావిస్తూ.. చిరు అంకుల్ అనడం విశేషం. వాళ్ల ఫ్యామిలీతో ఆమె ఫొటోలు కూడా దిగింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆ ఫొటోలకు సింధు పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది.

"పారిస్ ఒలింపిక్స్ లో నా తొలి మ్యాచ్ కు చిరు అంకుల్, చిన్ని కారా సహా మొత్తం ఫ్యామిలీ నాకు లవ్లీయెస్ట్ సర్‌ప్రైజ్. చిరు అంకుల్ లాగా ఈ ప్రపంచంలో క్లాస్, గ్రేస్, ఛార్మ్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సినిమాలో అత్యంత గౌరవనీయుడైన యాక్టర్ బహుశా ఆయనే. ఆయనలాగా మరెవరూ లేరు. ఉప్సీ, చరణ్, చిరు అంకుల్, సురేఖ ఆంటీ మీరంతా చాలా స్పెషల్" అని పీవీ సింధు క్యాప్షన్ పెట్టింది.

మెగా ఫ్యామిలీతో సింధు

మ్యాచ్ తర్వాత చిరు ఫ్యామిలీతో సింధు ప్రత్యేకంగా ఫొటోలు దిగింది. అందులో చిరంజీవితో కలిసి నడుస్తూ అతడు వేసిన జోక్ కు సింధు నవ్వడం కూడా చూడొచ్చు. ఈ ఇద్దరూ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నడిచారు. సింధు చేసిన పోస్టుకు ఉపాసన స్పందిస్తూ.. అక్కడికి వెళ్లడం చాలా బాగా అనిపించింది అని అనడం విశేషం. రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోనూ సింధుతో చెర్రీ ఉన్న వీడియోను షేర్ చేశారు.

"పీవీ సింధు అక్క.. ఇవాళ్టి మ్యాచ్ చించేశావ్.. ఆల్ ద బెస్ట్" అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ చేశారు. అందులో చరణ్ తన కుక్క రైమ్ ను ఎత్తుకోగా.. సింధు దానితో ఆడుకోవడం చూడొచ్చు. పారిస్ ఒలింపిక్స్ తొలి మ్యాచ్ లో సింధు గెలిచి శుభారంభం చేసింది. ఇప్పటికే వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన సింధు.. ఇప్పుడు హ్యాట్రిక్ మెడల్స్ పై కన్నేసింది.

మెగా ఫ్యామిలీ వెకేషన్

పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ, సింధు మ్యాచ్ చూసే ముందు మెగా ఫ్యామిలీ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. చిరంజీవితోపాటు అతని భార్య సురేఖ, రామ్ చరణ్, అతని భార్య ఉపాసన, చిన్నారి క్లిన్ కారా కలిసి ఈ వెకేషన్ కు వెళ్లారు. లండన్ లో హాలీడే, తర్వాత ఒలింపిక్స్ లో దిగిన ఫొటోలను చిరంజీవి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ప్రస్తుతం చిరు తన నెక్ట్స్ మూవీ విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఇక ఆగస్ట్ 22న పుట్టిన రోజు జరుపుకోబోతున్న చిరంజీవికి బర్త్ డే గిఫ్ట్ గా అతని సూపర్ హిట్ మూవీ ఇంద్ర రీరిలీజ్ కాబోతోంది.