Pushpa 2: పుష్ప 2 తొక్కిసలాటపై సెటైరికల్ ఫోక్ సాంగ్.. టికెట్లు మేమే కొనాలి, సావులు మేమే సావాలే అంటూ! (వీడియో)
Ticketlu Meme Konali Folk Song On Pushpa 2 Incident: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ తొక్కిసాలట ఘటనపై సెటైర్ వేస్తూ ఓ ఫోక్ సాంగ్ను రిలీజ్ చేశారు. టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలే.. సావులు మేమే సావాలే.. సంపాదన మీరే కావాలే.. అంటూ సాగిన పాట పూర్తి వివరాలు చూద్దాం.
Ticketlu Meme Konali Folk Song On Pushpa 2 Incident: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ఓవైపు కలెక్షన్లతో సునామీ సృష్టిస్తే.. మరోవైపు తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పుష్ప 2 ప్రీమియర్ షోలు పడిన రోజున సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.
విచారణ-18 మంది నిందితులు
ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ముందస్తు బెయిల్ ద్వారా బయటకొచ్చిన అల్లు అర్జున్ను ఇటీవల పోలీసులు విచారించారు. మూడున్నర గంటలుపాటు సాగిన ఈ విచారణలో మొత్తంగా 18 మందిని నిందితులుగా చేర్చినట్లు వార్తలు వచ్చాయి.
సెటైరికల్గా ఫోక్ సాంగ్
అయితే, తాజాగా పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై సెటైరికల్గా ఓ ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. మసాల బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి ఈ పాటను డిసెంబర్ 27న విడుదల చేశారు. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో దానిని ప్రధానంగా చేసుకుని ఈ పాటను రచించారు.
ఫ్యాన్స్ తిప్పలపై
టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలి.. సావులు మేమే సావాలే.. సంపాదన మీరే కావాలే.. అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటలో పుష్ప 2 ఘటన తర్వాత జరిగిన పరిణామాలను వ్యంగంగా వివరించారు. హీరోల కోసం అభిమానులు పడేపాట్లు, తిప్పలు, కష్టాలతో లిరిక్స్ రాశారు.
మేమే కొనాలి.. మేమే సావాలి
పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై సెటైరికల్గా వచ్చిన ఈ ఫోక్ సాంగ్ "టికెట్లు మేమే కొనాలి"లో రవలి నటించారు. సింగర్ ప్రభా పాటను ఆలపించారు. ఇక ఈ పాటకు లిరిక్స్, స్టోరీ, కాన్సెప్ట్ను చెలుకల శ్రీనివాస్ యాదవ్ అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్తోపాటు దర్శకత్వం నరేష్ వేల్పుల నిర్వర్తించారు. మసాలా బ్యాండ్కు యూట్యూబ్లో 1.75K ఫాలోవర్స్ ఉండగా.. ఈ సాంగ్ని ఇప్పటికీ 7,119 మంది చూశారు.
భిన్న రకాలుగా కామెంట్స్
ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి పలు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "విప్లవం ఎక్కడో పుట్టదు.. పల్లెపాట నుంచే పుడుతది", "ఇలాంటి పాటలు ఎన్నో రావాలి, ఫ్యాన్స్ అనే మాఫియా మారాలి" అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "సెన్సిటివ్ ఘటనపై ఇలా వ్యంగంగా పాట చేయడం కరెక్ట్ కాదు" అంటూ ట్విట్టర్లో పోస్ట్లు పెడుతున్నారు.
శ్రీతేజ్కు ఆర్థిక సాయం
ఇదిలా ఉంటే, పుష్ప 2 సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోగా.. ఆమె కుమారుడు శ్రేతేజ్ క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు బాబు పరిస్థితి బాగుందని, కోలుకుంటున్నాడని, స్పందిస్తున్నాడని వైద్యులు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్, సుకుమార్ కలిపి మొత్తంగా రూ. 2 కోట్లు శ్రీతేజ్కు ఆర్థికసాయంగా అందించనున్నారని, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారని టాక్ వినిపించింది.