Pushpa 2: పుష్ప 2 మూవీ వేయలేదని థియేటర్ని ధ్వంసం.. చంపేస్తామంటూ థియేటర్ ఓనర్కి బెదిరింపులు
Allu Arjun Fans: పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదలైంది. మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులు..?
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పుష్ప 2 మేనియా నడుస్తోంది. సోషల్ మీడియాలో పుష్ప 2 కలెక్షన్లు, అల్లు అర్జున్ నటన గురించి జోరుగా చర్చ నడుస్తోంది. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. మూవీ కోసం అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూశారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఒక మహిళ మృతి చెందింది. అలానే ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
థియేటర్ను ధ్వంసం
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పుష్ప సినిమా వేయలేదని థియేటర్పై కొంత మంది రాళ్లదాడికి దిగారు. అనంతరం థియేటర్ ఓనర్పై బెదిరింపులకి కూడా దిగారు. చెన్నైరులోని శ్రీనివాస థియేటర్లో మరమ్మతుల కారణంగా పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోయారు. దాంతో.. థియేటర్ ఓనర్ కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లిన కొంత మంది.. మూవీని ఎందుకు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన మరమ్మతుల సమాధానం నమ్మని వాళ్లు గొడవకి దిగారు.
అనంతరం థియేటర్ లోపలికి ప్రవేశించి రాళ్లతో థియేటర్లోని అద్దాలను ధ్వంసం చేశారు. సినిమా వేయకపోతే.. నీ అంతుచూస్తామంటూ కుర్మ రాజమల్ల గౌడ్పై బెదిరింపులకి దిగారు.
థియేటర్ని ధ్వంసం చేయడంతో పాటు తనపై బెదిరింపులకి దిగారంటూ బజ్జూర్ వినయ్ అతని స్నేహితులపై కుర్మ రాజమల్ల గౌడ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తొలిరోజే రూ.200 కోట్లు
పుష్ప 2 రిలీజైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ.180 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే వసూళ్లు రూ.200 కోట్లుపైమాటే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. తొలిరోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న పుష్ఫ2.. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు రాబడుతోంది.