పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్ పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవడంతో మళ్లీ ఆయన షూటింగ్లకు ఎప్పుడొస్తారో అనేది సందిగ్ధంగా ఉంది. కాగా, నాలుగేళ్ల కిందట 2020లో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. అయితే, తాజాగా నేడు (జూలై 28) ఈ సినిమాపై నిర్మాత రామ్ తళ్లూరి స్పందించారు.
విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న మెకానిక్ రాకీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు (జూలై 28) జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మూవీ టీమ్ సభ్యులు మాట్లాడారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్తో సురేందర్ రెడ్డి చిత్రం గురించి నిర్మాత రామ్ తళ్లూరి ఈ ప్రెస్మీట్లో క్వశ్చన్ ఎదురైంది. దీంతో ఆయన స్పందించారు. తమ సైడ్ పనులన్నీ అయిపోయాయని చెప్పారు.
ఈ సినిమా అంతా పవన్ కల్యాణ్ చేతుల్లోనే ఉందని, తమ సైడ్ పనులన్నీ అయిపోయాయని రామ్ తాళ్లూరి తెలిపారు. “మన చేతుల్లో ఏం లేదు. ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. మా సైడ్ వర్క్ అయిపోయింది. స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది. పూజ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ అంతా ఆయన చేతుల్లో ఉంది. ఒక వారం ముందే ఆయనను కలిశా” అని రామ్ తాళ్లూరి తెలిపారు. వీలు చూసుకొని పెండింగ్ సినిమాలను పవన్ కల్యాణ్ చేయొచ్చని ఆయన అన్నారు.
2020లో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డితో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. “యథా కాలమ్.. తథా వ్యవహారమ్” అంటూ ఓ పోస్టర్ వచ్చింది. ఏజెంట్ పూర్తయ్యాక పవన్తో సురేందర్ రెడ్డి ఈ మూవీ చేస్తారని భావించినా.. అలా జరగలేదు. దీంతో ఈ చిత్రం ఇక లేదేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తన పెండింగ్ సినిమాల గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ఓ సభలో స్పందించారు. తాను ప్రస్తుతం తన మంత్రిత్వ శాఖలపై దృష్టి పెట్టానని అన్నారు. కనీసం మూడు నెలలు పూర్తిగా ఈ పనులపైనే ఉంటాననేలా చెప్పారు. ఇప్పటికీ అంగీకరించిన సినిమాలు ఆ తర్వాత వీలుచిక్కినప్పుడు షూటింగ్లు చేస్తూ పూర్తి చేస్తానని అన్నారు. అయితే, ఇప్పటి నుంచి తన అధిక ప్రాధాన్యత ప్రజాసేవకే అని పవన్ స్పష్టం చేశారు.
ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఆయన ముందుగా ఏ చిత్రానికి ప్రాధాన్యత ఇస్తారో అనేది ఉత్కంఠగా ఉంది. వీటిలో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ ఎక్కువ శాతం షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. దీంతో ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీనే ముందుగా వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
హరిహర వీరమల్లు సినిమాను కూడా నిర్మాతలు ట్రాక్పై తెచ్చారు. ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రం రెండు భాగాల్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ టీజర్నే మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓజీ, హరిహర వీరమల్లు తర్వాతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డితో పవన్ సినిమా చేస్తారా లేదా అనే విషయం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.