ఈ ఏడాది 2024 తొలి అర్ధభాగంలో (జనవరి నుంచి జూన్ వరకు) కొన్ని తెలుగు వెబ్ సిరీస్లు వచ్చాయి. వివిధ జానర్లలో ఓటీటీల్లో సిరీస్లు అడుగుపెట్టాయి. వీటిలో కొన్నితెలుగు వెబ్ సిరీస్లు బాగా పాపులర్ అయ్యాయి. మంచి వ్యూస్ దక్కించుకన్నాయి. ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ సహా మరిన్ని కొన్ని సక్సెస్ అయ్యాయి. అలా.. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో వచ్చిన పాపులర్ అయిన టాప్-5 తెలుగు సిరీస్లు ఏవో ఇక్కడ చూడండి.
సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్ర పోషించిన 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ భారీ సక్సెస్ అయింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. 1990ల్లో ఓ మధ్యతరగతి కుటుంబం చుట్టూ సాగే కథ కావడంతో ఈ సిరీస్ చాలా మందికి కనెక్ట్ అయింది. దీంతో మంచి విజయం సాధించింది. 90s సిరీస్కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో శివాజీతో పాటు వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక, స్నేహల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్కు ప్రేక్షకులతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మంచి విజయం సాధించింది. డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్కు భారీ వ్యూస్ దక్కాయి. గతేడాది వచ్చిన తొలి సీజన్కు సీక్వెల్గా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఈ ఏడాది మార్చి 15వ తేదీన స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని గంగి రెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, సీరత్ కపూర్ ఈ సిరీస్లు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ సిరీస్కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. భార్యభర్తల గొడవలు, కామెడీ, ఎమోషన్లతో కూడిన సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కూడా ఈ ఏడాది పెద్ద సక్సెస్ అయింది. హాట్స్టార్ ఓటీటీలో కొన్ని వారాల పాటు టాప్లో ట్రెండ్ అయింది.
పరువు వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట, పెద్దల పట్టింపులు, మర్డర్ చుట్టూ ఈ థ్రిల్లర్ సిరీస్ తిరుగుతుంది. కులం ఫీలింగ్ ఈ సిరీస్లో ప్రధానంగా ఉంటుంది. పరువు వెబ్ సిరీస్లో నివేదా పేతురాజ్, నగేశ్ అగస్త్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్, సునీల్ కొమ్మిశెట్టి ప్రధాన పాత్రలు చేశారు. పరువు సిరీస్ కూడా పాపులర్ అయింది. ఈ సిరీస్కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు.
సూపర్ నేచులర్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్గా ‘యక్షిణి’ అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్ 14వ తేదీన ఈ సిరీస్ డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించటంతో ఈ సిరీస్కు మంచి హైప్ వచ్చింది. తేజ మర్ని దర్శకత్వం వహించిన యక్షిణి సిరీస్లో రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బిగ్బాస్ ఫేమ్ అభిజిత్ దుద్దల ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత లావణ్య చేసిన తొలి సిరీస్ ఇదే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. లవ్ కామెడీ డ్రామాగా వచ్చిన మిస్ పర్ఫెక్ట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సిరీస్కు విశ్వక్ కండేరావ్ దర్శకత్వం వహించారు.
టాపిక్