బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్.. తన అభిప్రాయాలను సూటిగా చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు సంచలనం అవుతుంటాయి. తాజాగా పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ గురించి అనురాగ్ మాట్లాడారు. ఈ ట్రెండ్ విపరీతంగా ఉన్న సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పాన్ ఇండియా సినిమా అనేది పెద్ద స్కామ్ అని చెప్పారు. అందుకు కారణమేంటో కూడా వివరించారు.
ఇండియా అంతా సినిమా ఆడితే అది పాన్ ఇండియా అవుతుందని, కానీ అసలు తెరకెక్క ముందే పాన్ ఇండియా అని సినిమాలను పిలుస్తున్నారని అనురాగ్ కశ్యప్ అన్నారు. పాన్ ఇండియా అనేది పెద్ద మోసం అని చెప్పారు. ఈ పేరుతో వచ్చే సినిమాల్లో ఒక్క శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయని అన్నారు.
పాన్ ఇండియా మోజులో పడడం వల్ల స్టోరీ టెల్లింగ్ తగ్గిపోయిందని అనురాగ్ కశ్యప్ అన్నారు. “బాహుబలి తర్వాత ప్రభాస్తో పాటు ఇతరులతో పెద్ద సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. కేజీఎఫ్ సక్సెస్ కావడంతో అలాంటి చిత్రాలు తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ కావడంతో జాతీయవాద సినిమాలు చేయడం మొదలుపెట్టారు. స్టోరీటెల్లింగ్ అనేది తగ్గడం మొదలైపోయింది” అని హిందూ నిర్వహించిన ది హడిల్ కార్యక్రమంలో అనురాగ్ కశ్యప్ చెప్పారు.
పాన్ ఇండియా పేరుతో వచ్చే సినిమా రూపొందేందుకు సుమారు మూడునాలుగేళ్లు పడుతోందని అనురాగ్ కశ్యప్ అన్నారు. “నా ఉద్దేశంలో పాన్ ఇండియా అంటే పెద్ద స్కామ్. ఓ సినిమాను రూపొందించేందుకు 3-4 ఏళ్లు పడుతుంది. చాలా మంది ఆ చిత్రంపై ఆధారపడతారు. మొత్తం డబ్బు ఆ సినిమా రూపొందేందుకు ఖర్చు చేయరు. పెద్దపెద్ద సెట్లపై ఖర్చు చేస్తారు. ఇలా చేయడంలో అర్థం లేదు. సక్సెస్ రేట్ ఒక్క శాతమే ఉంది” అని అనురాగ్ చెప్పారు.
చాలా మంది భారీ కలెక్షన్ల వేటలో పడుతున్నారని అనురాగ్ కశ్యప్ వివరించారు. “రూ.800కోట్లు, రూ.900కోట్లు, రూ.1000కోట్లు అంటూ చాలా మంది పాన్ ఇండియా ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అయితే వేల సినిమాలు రూపొందుతుంటే ఆ మార్కులను ఓ ఐదు సినిమాలు క్రాస్ చేస్తున్నాయి. ఈ నంబర్ గేమ్ల వల్లే నేను బాలీవుడ్ నుంచి వైదొలిగా” అని అనురాగ్ తెలిపారు. తాను బాలీవుడ్ను వదిలి తాను దక్షిణాదికి వెళుతున్నానని ఇటీవలే అనురాగ్ సంచలన ప్రకటన చేశారు.
సంబంధిత కథనం