పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గాంలో 26 మందిని టెర్రరిస్ట్ లు హత్య చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమె ఈ ప్రకటన చేసింది. గురువారం (ఏప్రిల్ 24) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఆమె ఈ దాడిని 'దుర్మార్గం' అని పేర్కొంది. ఇతర పాకిస్థాన్ సెలబ్రిటీలు కూడా స్పందించారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ రియాక్టయింది. ఇది దుర్మార్గమని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది. "ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస దుర్మార్గం. పహల్గాం దాడిలో ప్రభావితమైన వారందరికీ నా సంతాపం’’ అని పేర్కొన్న ఆమె.. గుండె పగలిన ఎమోజీని యాడ్ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడిని ఇతర పాకిస్థాన్ సెలబ్రిటీలు కూడా ఖండించారు. ఎంతో బాధగా ఉందంటూ పోస్టులు పెట్టారు. ఫవాద్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో.. “పహల్గాంలో జరిగిన దారుణమైన దాడి వార్త విని చాలా బాధగా ఉంది. ఈ భయంకరమైన సంఘటన బాధితుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
‘‘ఎక్కడైనా విషాదం అందరికీ విషాదమే. ఇటీవల సంఘటనల వల్ల ప్రభావితమైన అమాయకుల ప్రాణాల గురించి నా గుండె బాధపడుతోంది. బాధలో, దుఃఖంలో, ఆశలో మనం ఒకటే. నిర్దోషులైన జనాలు ప్రాణాలు కోల్పోయినప్పుడు, బాధ వారిది మాత్రమే కాదు.. అది మనందరికీ చెందినది. మనం ఎక్కడి నుండి వచ్చినా, దుఃఖం ఒకే భాష మాట్లాడుతుంది. మనం ఎల్లప్పుడూ మానవత్వాన్ని ఎంచుకుందాం’’ అని హానియా ఆమిర్ పోస్టు చేసింది.
“ప్రభావితమైన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం... ఒకరిపై ఉగ్రవాదం అంటే అది అందరిపై ఉగ్రవాదం అనే అర్థం. ప్రపంచానికి ఏమి జరుగుతోంది" అని ఫర్హాన్ సయీద్ రాసుకొచ్చాడు. ‘‘ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే. అది పాకిస్తాన్లో, భారతదేశంలో లేదా మరెక్కడైనా జరిగినా ఖండించాలి. మనం అలాంటి అర్థరహిత హింసకు వ్యతిరేకంగా నిలబడాలి" అని నటుడు ఉసామా ఖాన్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
పహల్గాంలోని బైసారన్ మైదానంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో 25 మంది ఇండియన్స్, ఓ నేపాలీ మరణించారు.
సంబంధిత కథనం