OTT: ఆ సిరీస్ స్ట్రీమింగ్కు లైన్ క్లియర్.. సీబీఐ పిటిషన్ కొట్టేసిన కోర్టు
The Indrani Mukerjea Story: The Buried truth: ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ స్ట్రీమింగ్కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఎట్టకేలకు ఈ డాక్యు సిరీస్ ప్రకటించిన తేదీకే స్ట్రీమింగ్కు రానుంది.
The Indrani Mukerjea Story: ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్కు రాకముందే చర్చనీయాంశంగా మారింది. షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందిస్తుండటంతో చాలా ఆసక్తి నెలకొంది. షీనా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం సహా చాలా సంచలన విషయాలు, మలుపులు ఉన్న కేసు కావడంతో ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, నెట్ఫ్లిక్స్ ఓటీటీటీలో రానున్న ఈ సిరీస్ను స్ట్రీమింగ్కు రాకుండా ఆపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. కోర్టులో పిటిషన్ను ఇటీవల దాఖలు చేసింది. దానిపై వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించింది.
ఫిబ్రవరి 23వ తేదీన ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రకటించింది. అయితే, ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఈ సిరీస్ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రభావితం అవుతుందని ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టులో సీబీఐ కేసు వేసింది. అయితే, వాదనలు విన్న న్యాయస్థానం ఈ సిరీస్ స్ట్రీమింగ్ను ఆపాలని ఆదేశించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు లైన్ క్లియర్ అయింది.
ఆ సిరీస్ బ్రాడ్కాస్ట్ను ఆపే స్వభావిక అధికారింగా కోర్టుకు లేదని, సంబంధిత ఫోరమ్ను సంప్రదించాలని సీబీఐకు సూచించారు సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్పీ నాయక్ నింబల్కర్. దీంతో 23వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చేందుకు మార్గం సుగమమైంది.
అభ్యంతరాలివే..
ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ సిరీస్లో షీనా బోరా హత్య కేసులో నిందితులతో పాటు సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, విచారణ ముగిసే వరకు ఇది స్ట్రీమ్ కాకుండా ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తరఫున కోర్టులో గత వారం పిటిషన్ వేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీకే నందోడ్. నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా ఈ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్, మెటీరియల్ అందించి ఉండొచ్చని, విషయాలను వక్రీకరించే అవకాశం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు నెట్ఫ్లిక్స్ ఓటీటీకి కూడా కోర్టు నోటీసులు పంపింది.
దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఏదైనా కంటెంట్ బ్లాక్ చేయాలంటే నిబంధనల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ సెక్రటరీ ప్రదిపాదించాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. అలాంటిది ఏమీ సమర్పించినందున సీబీఐ వేసిన పిటిషన్ను తిరస్కరించింది.
కేసు ఇదే..
షీనా బోరా 2012 ఏప్రిల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. రాయగడ జిల్లాకు సమీపంలోని ఓ అడవిలో ఆమె కాలిన శరీరం లభ్యమైంది. అయితే, ఇది జరిగిన మూడేళ్లకు ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా అరెస్ట్ అయ్యారు. ఆమె డ్రెవర్ శ్వాంవర్ రాయ్ వేరే కేసులో అరెస్ట్ కాగా.. ఆ క్రమంలో ఈ హత్య కేసు విషయం బయటికి వచ్చింది. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త సంజీవన్ ఖన్నా కూడా అరెస్ట్ అయ్యారు. 2022 మేలో ఇంద్రాణికి బెయిల్ వచ్చింది. రాయ్, ఖన్నా కూడా బెయిల్పై బయట ఉన్నారు.