OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి ఈ వారమే వస్తున్న తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రిలీజ్ ట్రైలర్
OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి ఈ వారం తెలుగులో ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ నటించిన ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 9) రిలీజైంది.
OTT Mystery Thriller Web Series: మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సిరీస్ పేరు హరికథ. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
హరికథ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
హరికథ వెబ్ సిరీస్ మైథాలజీ జోడించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వరకు మైథాలజీ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా రాబోతున్న ఈ సిరీస్ కూడా ఎంతో ఆసక్తి రేపుతోంది. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి హరికథ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ లాంటి వాళ్లు నటించారు. కొన్నాళ్లుగా ఈ సిరీస్ ను హాట్స్టార్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండగా.. తాజాగా సోమవారం (డిసెంబర్ 9) రిలీజ్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
హరికథ ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవుడే వచ్చి తమ ఊళ్లో వాళ్లను చంపుతున్నాడని నమ్మే ఓ ఊరి చుట్టూ తిరిగే కథే ఈ హరికథ. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ ట్రైలర్ కూడా స్టోరీపై ఓ గ్లింప్స్ ఇచ్చింది. పవిత్రానాయ సాధూనాం అనే భగవద్గీతలోని శ్లోకం బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుండగా.. ఈ ట్రైలర్ మొదలవుతుంది.
స్క్రీన్ పై వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న ఊళ్లో ఈ వరుస హత్యలేంటన్న ఆందోళన అంతటా కనిపిస్తుంది. ఆ దేవుడే ఈ హత్యలు చేస్తున్నాడంటూ అక్కడున్న వాళ్లు నమ్ముతుంటారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్.. ఈ హత్యల వెనుక మిస్టరీని తాను ఛేదిస్తానంటూ సవాలు చేస్తాడు.
ఈ క్రమంలో తన వాళ్లను కూడా కోల్పోతాడు. ఆ హత్యలు చేస్తున్నదెవరు? నిజంగా ఆ దేవుడే దిగి వచ్చి దుష్టులను శిక్షిస్తున్నాడా? ఆ హత్యలను పోలీస్ ఆఫీసర్ ఛేదించగలడా? అన్న ప్రశ్నలకు ఈ వెబ్ సిరీస్ సమాధానం చెప్పనుంది. ట్రైలర్ చివర్లో నిజంగా ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా చూపించడం ఆసక్తి రేపుతోంది.
మైథాలజీని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ ఈ జానర్ పై పడ్డాయి. ఈ నేపథ్యంలో హరికథ వెబ్ సిరీస్ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సిరీస్ ను డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడొచ్చు.