Ram Gopal Varma on Animal Movie: యానిమల్ సినిమా గురించి ప్రస్తుతం చర్చ విపరీతంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాగా.. 8 రోజుల్లో రూ.600కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్బాస్టర్ అయింది. అయితే, ఇదే క్రమంలో కొందరి నుంచి యానిమల్ మూవీపై విమర్శలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. కాగా, యానిమల్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశంసలు కొనసాగించారు. తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ యానిమల్ మూవీ గురించి మాట్లాడారు.
యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ నటన అద్భుతమని రామ్గోపాల్ వర్మ ప్రశంసించారు. అయితే, రణ్బీర్ క్యారెక్టర్ను వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే ఎలా ఉండేదని ఊహించారా అని ఆర్జీవీకి ప్రశ్న ఎదురైంది. వేరే ఏ హీరో సూటయ్యే వారని క్వశ్చన్ వచ్చింది. దీనికి రామ్గోపాల్ వర్మ స్పందించారు. రణ్బీర్ కాకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే ఆ పాత్రకు సూటయ్యే వాడని ఆర్జీవీ చెప్పారు.
“సినిమా చూసిన తర్వాత ఆ విషయం చెప్పడం చాలా కష్టం. అయితే, నా అభిప్రాయం ప్రకారం రణ్బీర్ తప్ప మరెవరూ ఆ పాత్రను అలా చేయలేరు. అయితే, రణ్బీర్ కాకుండా అంటే విజయ్ దేవరకొండ చేసి ఉండేవాడు. వీరిద్దరూ తప్ప మిగిలిన వారు ఈ క్యారెక్టర్ చేయడం కష్టమే” అని రామ్గోపాల్ వర్మ అన్నారు.
యానిమల్తో సినిమా ఇలానే ఉండాలన్న ఫార్ములాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బద్దలుకొట్టారని ఆర్జీవీ మరోసారి అన్నారు. అలాగే, ఆ మూవీలో హింస, బోల్డ్ సీన్లు హద్దులు దాటాయని వస్తున్న విమర్శలపైనా ఆర్జీవీ మాట్లాడారు. సినిమాలు ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపిస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని ఆర్జీవీ చెప్పారు. యానిమల్ కథ కంటే సందీప్ రెడ్డి వంగా దాన్ని తెరకెక్కించిన విధానమే తనకు అద్భుతంగా నచ్చేసిందని రామ్గోపాల్ వర్మ వివరించారు. యానిమల్ మూవీని ప్రశంసిస్తూ ఇటీవల ఓ రివ్యూ కూడా ఆయన రాశారు.
యానిమల్ మూవీలో రణ్బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. విలన్గా చేసిన బాబీ డియోల్ కూడా సూపర్ కమ్బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో రణ్బీర్ తండ్రి పాత్రలో చేశారు అనిల్ కపూర్. యానిమల్తో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. యానిమల్ మూవీ 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.600కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
సంబంధిత కథనం