NTR 100 Years : ఎన్టీఆర్ మెుదటి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారు?
NTR 100 Years : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి. ఆయన కథానాయకుడు నుంచి మహానాయకుడు వరకు చేసిన ప్రయాణంలో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. అయితే మెుదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా?
నాలుగు దశాబ్దాలపాటు.. సినిమా రంగాన్ని ఏలిన కింగ్ ఎన్టీఆర్. ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడో ఓ చిన్న ఊరులో జన్మించిన ఆయన.. ఎవరూ ఊహించనిస్థాయికి వెళ్లారు. సినిమాల్లోకి రావడంతో ఆయన జీవితమే మారిపోయింది. మెుదటి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? పారితోషికం ఎంత?
ఎన్టీఆర్ కు కాలేజీ రోజుల నుంచే నాటకాలు అంటే ఆసక్తి. దీంతో కాలేజీ వార్షికోత్సవంలో భాగంగా.. విశ్వనాథ సత్యనారాయణ రాసిన.. రాచమల్లు దౌత్యం అనే నాటకంలో నాగమ్మ పాత్ర పోషించారు. అక్కడ నుంచి ఆయన నట ప్రస్థానం మెుదలైంది. తర్వాత అనార్కలి నాటకంలో సలీం పాత్రను పోషించారు. తర్వాత అద్భుత నటనకు బహుమతి అందుకున్నారు. 1942లో మేనమామ కుమార్తె బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్.
గుంటూరు ఏ.సీ కాలేజీలో బీఏలో జాయిన్ అయ్యారు. అక్కడ జగ్గయ్య, కేవీఎస్ శర్మలాంటి వాళ్లు పరిచయం అయ్యారు. పలు నాటకలు వేసేవారు. ఓసారి ఎన్టీఆర్ వేసిన నాటకాన్ని శ్రీరంజని భర్త నాగుమణి చూశారు. అతడికి బాగా నచ్చింది. మరోవైపు సి పుల్లయ్య కీలుగుర్రం అనే సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు. కొత్త నటీనటుల కోసం వెతుకుతున్నారు. నాగుమణి వెంటనే ఎన్టీఆర్ ను అక్కడకు తీసుకెళ్లారు. ఆయన ఫొటోలు తీసుకున్నారు. మద్రాసు వెళ్లాక ఏం విషయం అని చెబుతానన్నాడు. కానీ అటువైపు నుంచే ఎలాంటి సమాధానం లేదు. కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్లాయి.
ఇక ఇదంతా మనకు సెట్ కాదులే అనుకుని.. ఉద్యోగం మీద ఫోకస్ పెట్టారు ఎన్టీఆర్. మద్రాసు సర్వీస్ కమిషన్ సబ్ రిజిస్ట్రార్ సెలక్షన్స్ లో ఎంపికై.. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ గా చేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ కు కొన్ని ఉత్తరాలు కూడా వచ్చాయి. సినిమాల్లో అవకాశాలు ఇస్తాం రమ్మని చెప్పారు. కానీ పెద్దగా ఆయన పట్టించుకోలేదు. ఓ రోజున ఎల్వీ ప్రసాద్ నుంచి లెటర్ వచ్చింది. నటి కృష్ణవేణి నిర్మిస్తున్న మనదేశం సినిమాకు పని చేస్తున్నట్టుగా, ఇందులో ఓ మంచి పాత్ర ఉందని చెప్పారు. ఉత్తరాన్ని రామారావు పట్టించుకోలేదు. మరోసారి ఎల్వీ ప్రసాద్ నుంచి లెటర్ వచ్చింది. అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఎల్వీ ప్రసాద్ రాసిన ఉత్తరం ఒకటి కాగా, మరొకటి బిఎ సుబ్బారావు రాసింది. పల్లెటూరి పిల్ల సినిమాలో ముఖ్య పాత్రకు రామారావును ఓకే చేశామని, మద్రాసుకు రావాలని సుబ్బారావు ఆ లేఖలో రాశారు. ఇంట్లో వాళ్లతో చర్చించిన ఎన్టీఆర్ మద్రాసుకు వెళ్లారు.
మరోవైపు రామారావును నటి, నిర్మాత కృష్ణవేణికి పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. తన సినిమాలోకి ఎన్టీఆర్ ను తీసుకున్నారు. ఇందులో రెండు వేల రూపాయల పారితోషికం మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ రూ.200 చెక్కు ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశంలో అవకాశం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 1949లో విడుదలైంది. ఇక తర్వాత ఎన్టీఆర్ హీరోగా పల్లెటూరి పిల్ల, షావుకారు అనే సినిమాలు వచ్చాయి. ఈ అవకాశాలు వచ్చేందుకు కారణం ఎల్వీ ప్రసాద్. అలా ఎన్టీఆర్ నటప్రస్థానం మెుదలైంది.