Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్లో (NNS 20th June Episode) నా కూతురిని కాపాడుకోడానికి ఆ ఘోరాకు బంధీ అవడం తప్ప మరో మార్గం లేదు గుప్త గారు. మీ చెల్లిగా ఓ చిన్న సాయం అడుగుతున్నాను. స్వార్థంతోనే అడుగుతున్నాను. నా పిల్లలకు, కుటుంబానికి సహాయంగా ఉండండి.. ప్లీజ్ అంటూనే సీసాలోకి వెళ్లిపోతుంది అరుంధతి.
తాను ఎంతగానో ఎదురుచూస్తున్న ఆత్మ బంధీ కావడంతో గెలిచానంటూ అరుస్తాడు ఘోరా. అరుంధతి బంధీగా మారిందని తెలుసుకుని సంబరపడిపోతుంది మనోహరి. త్వరలోనే మన పెళ్లి జరిగిపోతుంది అమర్. ఘోరా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అమర్ ఎప్పుడైనా రావచ్చు. అమ్ముని మా ఇంటికి దగ్గర్లో వదిలెయ్ అంటుంది మనోహరి.
నీ పని అయిపోయింది మనోహరి.. కానీ, నా పని ఇంకా అవలేదు. చెప్పాను కదా.. ఈరోజుతో ఇద్దరి పని అవుతుందని అంటాడు ఘోరా. అదేంటి.. నీ పనేంటి అని ఆశ్చర్యపోతుంది మనోహరి. అమ్ము చావుతోనే ఆత్మ బంధనం విజయవంతం అవుతుంది అంటాడు ఘోరా. అదేంటీ.. అంటుండగానే అమర్, రాథోడ్ అక్కడకు రావడం చూసి అక్కడ నుంచి త్వరగా వెళ్లమని ఘోరాకు చెప్పి పారిపోతుంది మనోహరి.
అమ్ముని పరిగెత్తుకుంటూ దూకెయమని చెబుతాడు ఘోరా. అమ్ముని వెనక్కిరమ్మని పిలుస్తుంది భాగీ. కానీ, అమ్ము వినిపించుకోకపోవడంతో పరిగెత్తుకెళ్లి వెనక్కి లాగి తాను పడిపోతుంది. పారిపోతున్న ఘోరాను అమర్, రాథోడ్ పట్టుకుంటారు. ఘోరా చేతిలోని సీసాను అమర్ బలంగా తన్నడంతో దాంట్లో బంధీగా ఉన్న అరుంధతి ఆత్మ విముక్తి పొందుతుంది. అయితే, ఘోరా వాళ్లనుంచి తప్పించుకుంటాడు.
అమ్ముని కాపాడి భాగీ కిందపడిందని తెలుసుకుని పరిగెత్తుకెళ్లి చూస్తాడు అమర్. భాగీ స్పృహ లేకుండా పడి ఉండటం చూసి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తన కొడుకు జీవితం ఇలా ఎందుకు మారిపోతోంది. ఎవరి దిష్టి తగిలిందని నా కొడుకు జీవితం ఇబ్బందుల పాలవుతోంది అంటూ ఏడుస్తుంది నిర్మల. అమ్ముకి అక్కడ జరిగింది గుర్తుకు వస్తే తన పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తుంది మనోహరి.
ఇంతలో అమ్ముకి స్పృహ వచ్చిందని చెప్పడంతో అందరూ లోపలకు వెళ్తారు. ఐస్క్రీమ్ కొనడానికి వెళ్లి ఏమైపోయావు అమ్ము.. మేమంతా ఎంత వెతికామో తెలుసా అంటుంది అంజు. ఐస్క్రీమ్ కొనడానికి వెళ్లాను కదా.. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు నాకు మెలకువ వచ్చేసరికి కొండమీద ఉన్నాను అంటూ మనోహరిని చూసి ఏమైంది ఆంటీ ఎందుకు కంగారు పడుతున్నారు అంటుంది అమ్ము.
అంతా గుర్తొచ్చినట్లుంది అనుకుంటూ తడబడుతుంది మనోహరి. అంతలోనే డాక్టర్ వచ్చి అందరినీ బయటకు పంపిస్తాడు. అంజు మాత్రం మేం అక్కతో మాట్లాడాలి అంటూ డాక్టర్ని బయటకు పంపించి అంతా మిస్సమ్మనే చేసిందని అంటారు. అలా కాదు.. మిస్సమ్మ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది అని నచ్చజెప్పడానికి చూస్తుంది అమ్ము. కానీ, అదంతా మిస్సమ్మ ప్లానేనని మొండిగా వాదిస్తుంది అంజు.
ఆనంద్, ఆకాష్ కూడా మిస్సమ్మను నమ్మలేం అని అక్కడనుంచి వెళ్తారు. ఒక్క క్షణంలో ఎన్ని జరిగాయంటాడు గుప్త. నా రక్తం పంచుకుని పుట్టిన కూతురు, నా భర్త నన్ను కాపాడారు. నేను వాళ్లకు కనపడకపోయినా నేను ఆపదలో ఉన్న ప్రతిసారీ నన్ను కాపాడుతున్నారు అంటుంది అరుంధతి.
ఇకపోతే మనోహరిని అమ్ము గుర్తుపడుతుందా? రాబోయే పౌర్ణమి రోజున అరుంధతి ఏం చేయాలనుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!