Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్లో (NNS 25th June Episode) వంట చేసి అందరినీ భోజనానికి పిలుస్తాడు అమర్. అనవసరంగా తొందరపడి ఉపవాసం అని చెప్పానని ఆకలితో అలమటిస్తుంది మనోహరి. అందరూ వచ్చారు మనోహరి ఏది అని అడుగుతాడు అమర్.
ఆ అమ్మాయి ఉపవాసం అని చెప్పింది కదా నాన్నా.. అందుకే పిలవలేదు అంటుంది నిర్మల. అందరూ వడ్డించుకుంటుండగా అమర్ కూడా భోజనానికి కూర్చుంటే ముందు అమ్మాయికి తినిపించి మాత్రలు వేసిరా అని చెప్పి పంపిస్తాడు శివరామ్. సరేనని వెళ్లి మిస్సమ్మకు భోజనం పెడతాడు అమర్. తనపై అమర్ చూపిస్తున్న ప్రేమకు సంతోషపడుతుంది మిస్సమ్మ.
కావాలనే అమర్ తల్లిదండ్రులు నాటకం ఆడుతున్నారని కోపంతో మంగళకు ఫోన్ చేస్తుంది మనోహరి. మిస్సమ్మకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి వెంటనే వచ్చి తీసుకెళ్లమని అంటుంది. సరేనంటూ రామ్మూర్తిని వెంటపెట్టుకుని అమర్ ఇంటికి వస్తుంది మంగళ. ఈరోజేంటో ప్రశాంతంగా ఉంది గుప్తగారు అంటుంది అరుంధతి.
అవునా.. అని గుప్త అంటుండగానే రామ్మూర్తి, మంగళ గేట్లో నుంచి లోపలకు వస్తూ ఉంటారు. అమ్మా.. భాగీ.. నీకు ఏమైందమ్మా? అంటూ ఏడుస్తూ వస్తున్న రామ్మూర్తిని చూసి అయ్యో గుప్తగారు.. ఆయన కూతురుకి ప్రమాదం జరిగిందని తెలుసుకుని బాధపడతున్నట్లున్నారు అంటుంది అరుంధతి. అట్లైన అతగాడి ముఖమున బాధ, కళ్లల్లో నీరు లేదేంటి.. అంటాడు గుప్త.
మంగళ, రామ్మూర్తి రాగానే మిస్సమ్మకు బాలేదని వెంటనే తీసుకుని వెళ్లండి అని చెబుతుంది మనోహరి. శివరామ్ ముందే చెప్పడంతో తొందరపడకుండా భాగీ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు రామ్మూర్తి. ఆ మనోహరి కావాలనే మంగళకు ఫోన్ చేసి తనని రప్పించిందని చెప్పడంతో ఆశ్చర్యపోతుంది భాగీ. నీ కాపురం చక్కబడాలంటే నువ్వు ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పి దానికి తన దగ్గర ఓ మంచి ఉపాయం ఉందని కిందకి వెళ్తాడు రామ్మూర్తి.
శివరామ్తో మాట్లాడి మంగళ వల్ల రావడం తప్పలేదని చెప్పి నాటకం మొదలు పెడదామంటూ హాల్లోకి వస్తాడు. మిస్సమ్మను కిందకు తీసుకొచ్చి కూర్చోపెడుతుంది మంగళ. తన కూతురు సంతోషంగా ఉంటుందని కాపురానికి పంపిస్తే ఇలా గాయాల పాలు చేస్తారా అంటూ ఏడ్చినట్లు నటిస్తాడు రామ్మూర్తి. వెంటనే నా కూతురుని మా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు రామ్మూర్తి.
అదే మంచి నిర్ణయం అంకుల్.. తీసుకెళ్లండి అంటుంది మనోహరి. మిస్సమ్మను మేం కాలు కిందపెట్టకుండా చూసుకుంటాం అన్నయ్యగారు అని నిర్మల అనగానే.. ఏమన్నారమ్మా.. నా కూతురి కాలు కిందపెట్టకుండా చూసుకుంటారా.. అయితే ఇక్కడే ఉంచేస్తానంటాడు రామ్మూర్తి. కానీ, అంజు మాత్రం మిస్సమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని పట్టుబడుతుంది. ఓటింగ్ ద్వారా నిర్ణయిద్దామంటుంది.
కానీ, అంజు టీమ్కి ఐదు ఓట్లు, మిస్సమ్మ ఇంట్లోనే ఉండాలనుకునే టీమ్కి నాలుగు ఓట్లు రావడంతో అందరూ ఆలోచనలో పడతారు. ఇంతలో ఇంట్లో మిస్సమ్మ ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్న అమర్ని తాను ఇంట్లో ఏదో ఫైల్ మర్చిపోయానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు రాథోడ్. మిస్సమ్మకే తన ఓటు అని రాథోడ్ చెప్పడంతో రెండు టీమ్స్కి సమాన ఓట్లు రావడంతో టై అవుతుంది.
ఎవరూ ఊహించనట్లు అమర్ కూడా మిస్సమ్మ ఇంట్లోనే ఉంటుంది అనడంతో అంజు టీమ్ ఓడిపోతుంది. అమర్ నిర్ణయానికి మనోహరి షాకవుతుంది. మిస్సమ్మను అమర్ గెలిపించడం సంతోషంగా ఉన్నప్పటికీ తన భర్త వేరొకరిపై ప్రేమ చూపించడం చూసి తట్టుకోలేకపోతుంది అరుంధతి.
ఇంతలో యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి రేపు అమావాస్య ఘడియల్లో ఆత్మ అదృశ్యమవుతుందని చెబుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వినేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది అరుంధతి. అమావాస్య రోజు ఏం జరగబోతోంది? మిస్సమ్మను ఇంట్లో నుంచి పంపించడానికి మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!