రామ్ చరణ్ నిర్మిస్తున్న, నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న 'ది ఇండియా హౌస్' సినిమా సెట్లో గురువారం (జూన్ 12) నీటి ట్యాంక్ పగలడంతో వరద నీరు వచ్చి చేరింది. షామీర్పేటలోని సెట్ నీటితో నిండిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు చెప్పాడు.
'ది ఇండియా హౌస్' సెట్ నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోపై నిఖిల్ స్పందించాడు. ఇది చాలా పెద్ద ప్రమాదం అని, ఇది నిజంగానే జరిగిందని ధృవీకరించాడు. జరిగిన వివరాలను వివరిస్తూ, ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశాడు.
"మేము అందరం సురక్షితంగా ఉన్నాము. కొన్నిసార్లు మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అందించాలనే మా తపనలో మేము రిస్క్లు తీసుకుంటాము. అప్రమత్తమైన సిబ్బందికి, తీసుకున్న జాగ్రత్తలకు ధన్యవాదాలు. ఈరోజు మేము ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము. మేము ఖరీదైన పరికరాలను కోల్పోయాము. కానీ దేవుని దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. #IndiaHouse" అని నిఖిల్ ట్వీట్ చేశాడు.
అటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా స్పందించాడు. "ఈరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు #TheIndiaHouse సెట్లో ఒక ప్రమాదం జరిగింది. సెట్లో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు. మీ అందరి స్పందనకు ధన్యవాదాలు" అని అన్నాడు. అటు రామ్ చరణ్ నిర్మాణ సంస్థ నిఖిల్, అభిషేక్ పోస్టులను రీట్వీట్ చేసింది.
ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న క్లిప్లలో, సినిమా సెట్లో నీరు పొంగిపొర్లడంతో నటీనటులు, సిబ్బంది గట్టిగా అరుస్తున్నట్లు కనిపిస్తుంది. కొందరు నీటి ప్రవాహం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరికొందరు పరికరాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
నీటి ట్యాంక్ పగలడం వల్ల సంభవించిన వరదలో కొందరు సిబ్బంది గాయపడ్డారు. సెట్కు భారీ నష్టం వాటిల్లినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. సముద్రంలో సీన్ ను తీయడం కోసం నీటి ట్యాంక్ వినియోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
'ది ఇండియా హౌస్' చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతేడాది ఆగస్టులో తన 'కార్తికేయ 2' చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించిన తర్వాత హిందూస్థాన్ టైమ్స్తో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి చెప్పాడు.
"ఎవరు ఏమనుకున్నా 'ది ఇండియా హౌస్' వీర్ సావర్కర్ గురించి కాదు. ఇది నిజానికి 1905 నాటి భారతదేశంలోని భారతీయ విద్యార్థుల గురించి. నేను ఇంకా ఏమీ చెప్పలేను. (నవ్వుతూ). ఇది కూడా చూడదగిన సినిమానే. ఎందుకంటే నేను గొప్ప కథలను చెప్పడం కొనసాగించాలనుకుంటున్నాను" అని నిఖిల్ అన్నాడు.
సంబంధిత కథనం