Sumaya Reddy In Dear Uma Pre Release Event: టాలీవుడ్లోకి కొత్తగా హీరోయిన్గా తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా, రచయితగా సుమయ రెడ్డి వ్యవహరించిన తెలుగు మూవీ డియర్ ఉమ. ఇందులో పృథ్వీ అంబర్ హీరోగా సుమయ రెడ్డికి జోడీగా నటించాడు.
సాయి రాజేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన డియర్ ఉమ ఏప్రిల్ 18న అంటే ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ టాలీవుడ్ హీరోయిన్ సుమయ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. "అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మీడియానే మా ఈవెంట్కు ముఖ్య అతిథి. సాయి రాజేష్ గారు నేను చెప్పాల్సిందంతా చెప్పేశారు" అని అన్నారు.
"తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను రాసిన, తీసిన షార్ట్ ఫిల్మ్కు మంచి ఆదరణ దక్కింది. ఆ తరువాత సాయి రాజేష్ గారితో మళ్లీ డియర్ ఉమకు పని చేశాం" అని హీరోయిన్ సుమయ రెడ్డి తెలిపింది.
"నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్. నవీన్ గారి వల్లే రదన్ గారు మా ప్రాజెక్టులోకి వచ్చారు. ప్రతీ ఒక్కరూ వారి వారి డ్రీమ్ ప్రాజెక్టుకి పని చేసినట్టుగానే వర్క్ చేశారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు" అని సుమయ రెడ్డి చెప్పింది.
"మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు" అని న్యూ హీరోయిన్ సుమయ రెడ్డి ఎమోషనల్ అవుతూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత "ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. ఏప్రిల్ 18న మా చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయండి" అని సుమయ రెడ్డి కోరారు.
ఇదే ఈవెంట్లో హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ .. "డియర్ ఉమ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. నా దియా చిత్రాన్ని ఇక్కడ అందరూ ఆదరించారు. మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి" అని అన్నారు.
సంబంధిత కథనం