మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న చిత్రం (మెగా157)పై మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో ఎంటర్టైనింగ్ రోల్ను చిరూ చేయనుండటంతో చాలా హైప్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్బస్టర్ తర్వాత అనిల్ చేస్తున్న మూవీ కావడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్టుకు మరో బలం యాడ్ అయింది. ఈ సినిమా హీరోయిన్ను మేకర్స్ నేడు (మే 17) అధికారికంగా వెల్లడించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నేడు అధికారికంగా ప్రకటించారు. ఆయన స్టైల్లో ఓ వీడియోను కూడా రూపొందించారు.
మెగా157 మూవీలో నయనతార నటించనున్నారంటూ ఓ వీడియోను మేకర్స్ తీసుకొచ్చారు. ఇందులో మేకప్ వేసుకుంటున్న నయనతార తెలుగులో మాట్లాడతారు. తెలుగు చిత్రం చేస్తున్నారా అని హెల్పర్ అడిగితే.. అవుంటారు ఈ స్టార్ నటి. కారులో వెళుతుండగా.. “స్టార్ స్టార్ మెగాస్టార్” అని పాట వస్తుంటే సౌండ్ చిరంజీవి పాట.. సౌండ్ పెంచు అంటారు. చిరంజీవితో యాక్ట్ చేస్తున్నారా అని డ్రైవర్ అడిగితే అవునంటారు. మూవీ స్క్రిప్ట్ చదివి వెరీ ఎంటర్టైనింగ్ అని అంటారు నయన్.
“హలో మాస్టారు.. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా” అంటూ మెగాస్టార్ స్టైల్లో డైలాగ్ చెప్పారు నయనతార. ఇంతలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతికి రప్ఫాడించేద్దాం అని అనిల్తో కలిసి డైలాగ్ చెప్పారు నయన్. ఇలా ఇంట్రడక్షన్ వీడియోను ఎంటర్టైనింగ్గా తీసుకొచ్చారు అనిల్. నయనతార సాధారణంగా ఎక్కవగా ప్రమోషన్లలో పాల్గొనరు. కానీ అనిల్ రావిపూడి మాత్రం స్టార్టింగే ఆమెతో స్పెషల్ ప్రమోషనల్ వీడియో రూపొందించి స్పెషాలిటీ చాటారు.
చిరంజీవితో కలిసి నయనతార నటించడం ఇది మూడోసారి కానుంది. అయితే, హీరోయిన్గా మాత్రం రెండోసారి. సైరా నరసింహా రెడ్డి చిత్రంలో చిరూకు జోడీగా నయనతార నటించారు. అయితే, గాడ్ ఫాదర్ (2022) చిత్రంలో సోదరి పాత్ర చేశారు. ఇప్పుడు మెగా157 చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా నయనతార చేయనున్నారు. గాడ్ ఫాదర్ తర్వాత నయన్ చేస్తున్న తెలుగు మూవీ మెగా157 ప్రాజెక్టే కానుంది.
మెగా157 కామెడీ ప్రధానంగా ఉండే ఎంటర్టైనింగ్ మూవీ అని చిరంజీవి ఇప్పటికే చెప్పేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రం కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్ అడిగారని, దీంతో సందిగ్ధత నెలకొందనే సమాచారం కొంతకాలం క్రితం వచ్చింది. అయితే, నయనతారనే ఖరారు చేశారు మేకర్స్. ఎవర్ గ్రేస్ ఫుల్ క్వీన్ను మెగా157లోకి స్వాగతిస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటితో పాటు చిరంజీవి కుమార్తె కొణిదెల సుష్మిత నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.
చిరంజీవి నటించిన విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. విశిష్ట దర్శకత్వం వహించిన ఈ మూవీని ఈ ఏడాది జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు.
సంబంధిత కథనం