టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో సంక్రాంతి మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మెగా 157 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శుక్రవారమే (మే 23) ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా అంగీకరించినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.
చిరంజీవి 157వ సినిమాలో నయనతారకే అవకాశం ఇవ్వాలని మొదట భావించారు. అయితే ఆమె ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు. మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ సమయంలో నయన్ టీమ్ మళ్లీ వాళ్లను సంప్రదించింది.
ఇందులో తన పాత్ర ఆమెకు బాగా నచ్చడం, అది కూడా తక్కువ సమయం పాటే ఉండటంతో కేవలం రూ.6 కోట్లకే చేయడానికి ఆమె అంగీకరించిందని ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. అంతేకాదు ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయాలని కూడా ఆమె బలంగా భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
ఈమధ్యకాలంలో ఆమె తీసుకున్న అతి తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ మధ్యే నయనతారే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ అని అనౌన్స్ చేసి, ఆమెతో ఓ చిన్న ప్రమోషనల్ వీడియోను కూడా అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ సమయంలోనూ ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటుందని కూడా మేకర్స్ వెల్లడించారు.
ఇక చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ శుక్రవారం (మే 23) ప్రారంభమైంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాడు. తాజాగా సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తో మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమాను నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం