Nayanthara Marriage: పెళ్లి రోజు లక్ష మంది అనాథలు, వృద్ధులకు నయన్, విగ్నేష్ భోజనాలు
పెళ్లి రోజే ఎంతో గొప్ప పని చేశారు నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారమే లక్ష మందికిపైగా అనాథలు, వృద్ధులకు నోరూరించే భోజనాలు ఏర్పాటు చేసి తమ మంచి మనసు చాటుకున్నారు.
సెలబ్రిటీలు ఘనంగా పెళ్లి చేసుకోవడం కామనే. వాళ్ల పెళ్లిళ్లకు ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు రావడం, వారికి భారీ స్థాయిలో విందు భోజనాలు ఏర్పాటు చేయడమూ మనం చూస్తూనే ఉంటాం. నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి సందర్భంగానూ ఈ హంగూ ఆర్భాటాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే పని చేసింది.
తమ పెళ్లి రోజు వేల మందికి భోజనాలు పెడతామని ఈ జంట ముందుగానే ప్రకటించింది. చెప్పినట్లుగానే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఎన్నో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు రుచికరమైన భోజనాలు పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంట నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటూ కొందరు దీవించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.
తమ పెళ్లి రోజు సుమారు 18 వేల మంది అనాథ పిల్లలతోపాటు మరో లక్ష మందికి నయనతార, విగ్నేష్ జంట భోజనాలు పంపించడం విశేషం. వీళ్ల గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ జంటను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. వీళ్ల పెళ్లికి బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్తోపాటు రజనీకాంత్, బోనీ కపూర్, కార్తీ, విజయ్, మణిరత్నంలాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
గురువారం పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే అక్కడి మాఢవీధుల్లో నయనతార చెప్పులతో తిరగడంపై వివాదం చెలరేగింది. దీనిపై టీటీడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెబుతూ విగ్నేష్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
సంబంధిత కథనం