Tollywood: హిందీ బడా ప్రొడ్యూజర్ ముందే బాలీవుడ్ను ఏకేసిన తెలుగు నిర్మాత.. కఠినం అంటూనే కామెంట్స్
Naga Vamsi to Boney Kapoor: హిందీ నిర్మాత బోనీ కపూర్ ముందే బాలీవుడ్ను విమర్శించారు నాగవంశీ. వారి ఫిల్మ్ మేకింగ్ను ప్రశ్నించారు. బడా ప్రొడ్యూజర్ ముందే హిందీ సినిమాలను ఏకేశారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది.
బాలీవుడ్ బాక్సాఫీస్పై కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాలు ఆధిపత్యం చూపుతున్నాయి. హిందీలో డబ్బింగ్లోకి వెళ్లి.. అక్కడి సినిమాలను దాటేసి రికార్డులను సృష్టిస్తున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2 ఇలా తెలుగు సినిమాలు.. హిందీ బాక్సాఫీస్ను ఏలుతున్నాయి. మధ్యలో కన్నడ మూవీ కేజీఎఫ్ 2 కూడా అదరగొట్టింది. బాలీవుడ్ చిత్రాల కంటే.. తెలుగు చిత్రాలనే హిందీ జనాలు కూడా ఇష్టపడుతున్నారు. తాజాగా పాన్ ఇండియా నిర్మాతల డిబేట్లో ఆసక్తికరమైన చర్చ సాగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముందే హిందీ సినిమాలను గట్టిగా విమర్శించారు టాలీవుడ్ ప్రొడ్యూజర్ నాగవంశీ. వివరాలివే..
బాలీవుడ్ అక్కడే చిక్కుకుంది
తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉందని బోనీ కపూర్ అన్నారు. దక్షిణాది చిత్రాలకు ఉన్న ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడారు. అందుకే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయనేలా చెప్పారు. ఈ క్రమంలో నాగవంశీ కల్పించుకున్నారు. బాలీవుడ్ జనాలు సినిమాను చూసే విధానాన్ని దక్షిణాది ఇండస్ట్రీలు మార్చేశాయని నాగవంశీ అన్నారు.
బాంద్రా, జుహూ కోసమే సినిమాలు చేయడంలో బాలీవుడ్ చిక్కుకుపోయిందని నాగవంశీ చెప్పారు. గలాటా ప్లస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ మీట్లో ఇది జరిగింది. “ఇది కఠినంగా అనిపించినా దీన్ని అంగీకరించాలి. సినిమాను బాలీవుడ్ చూసే విధానాన్ని దక్షిణాది మార్చేసింది. మీరు బాంద్రా, జూహు కోసం సినిమాలు చేయడంలో స్ట్రక్ అయిపోయారు. మేం బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలాంటి సినిమాలు చేశాం. మొఘల్ ఇ ఆజం తర్వాత మీరు బాహుబలి, ఆర్ఆర్ఆర్ గురించి చెప్పారు. అవి తెలుగు సినిమాలు. మొఘల్ఇ- ఆజం తర్వాత ఏ హిందీ సినిమా గురించి చెప్పలేదు” అని నాగవంశీ అన్నారు. బాలీవుడ్ బ్లాక్బస్టర్స్ యానిమల్, జవాన్ చిత్రాలను తెరకెక్కించింది కూడా దక్షిణాది దర్శకులే అని చెప్పారు.
లేదు.. లేదు అంటూ బోనీ కపూర్ అంటున్నా నాగవంశీ తన వాదన కొనసాగించారు. ప్రతీ సినిమా గురించి మాట్లాడలేమని, విశాలమైన ఆలోచనలు పంచుకోవాలని బోలీ కపూర్ చెప్పారు. తనకు చాలా సినిమాలు తెలుసనని, వాటి గురించి చెప్పలేదని అన్నారు. తెలుగు సినిమానే ఇండియన్ సినిమాకు నేర్పలేదని చెప్పారు.
వెనక్కి తగ్గని నాగవంశీ
బాలీవుడ్ను వెనకేసుకొచ్చేందుకు బోనీ కపూర్ ప్రయత్నించినా.. నాగవంశీ తగ్గలేదు. “అది నేర్పించడం కాదు. ఇండియన్ సినిమాను మళ్లీ డిస్కవర్ చేశాం. మాస్, భారీ చిత్రాలు చేశాం” అని నాగవంశీ అన్నారు. అలాంటి చిత్రాలు ఎప్పుడూ ఉన్నాయని బోనీ చెప్పారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కూడా అమితాబ్ బచ్చన్ అభిమాని అన్నారు. అయితే, తాను కూడా షారూఖ్ ఫ్యాన్ అని నాగవంశీ చెప్పారు. ఎన్టీఆర్ ఫ్యాన్ అని అల్లు అర్జున్ చెప్పలేదు కదా అని బోనీ కపూర్ అన్నారు. అతడు మెగాస్టార్ చిరంజీవి అభిమాని కూడా అని వంశీ గుర్తు చేశారు. అయితే, మీడియా ముందు అతడు అమితాబ్ అభిమాని అని చెప్పుకున్నారని బోనీ అన్నారు.
హిందీలో బడా నిర్మాతగా ఉన్న బోనీ కపూర్ ముందే ధైర్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ తప్పును ఎత్తిచూపిన నాగవంశీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. హిందీ మేకర్లకు రియాలిటీ తెలిసివచ్చేలా మాట్లాడారని అంటున్నారు. బాంద్రా, జుహూ కోసమే తీసినట్టుగా జనాలను కనెక్ట్ కాకుండా.. ఓ మూస పద్ధతిలో బాలీవుడ్ ఎక్కువగా సినిమాలు చేస్తోందనే కామెంట్ను సమర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.