సెవెన్ హిల్స్ బ్యానర్పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా రూపొందిన సినిమా సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా చేశాడు. పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్స్గా నటించారు.
జులై 4వ తేదీన సోలో బాయ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల సోలో బాయ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకుడిగా, సింగర్గా, నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్లో ఆర్పీ పట్నాయక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. "దేశం కోసం ప్రాణాలకు అర్పించిన మురళి నాయక్ కుటుంబం కోసం త్వరలో ఒక మ్యూజికల్ నైట్ జరిపి తద్వారా ఆదాయాన్ని వారి కుటుంబానికి అందజేయాలని అనుకుంటున్నాను" అని తెలిపారు.
"ఇక సోలో బాయ్ చిత్రం గురించి చెప్పాలంటే ముందుగా నిర్మాత సతీష్ గురించి చెప్పాలి. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయనకు సినిమా అంటే పిచ్చి. తనకు వచ్చిన ప్రతి రూపాయి సినిమా పైనే పెడతారు" అని ఆర్పీ పట్నాయక్ అన్నారు.
"అలాగే గౌతమ్ కృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేసే నటుడు. భవిష్యత్తులో గౌతమ్ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడని తెలుస్తుంది. అతడిని చూస్తుంటే హీరో ఉదయ్ కిరణ్ను చూస్తే వచ్చే ఫీలింగ్ వస్తుంది. అతడి లాగానే వరుస విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు.
"చిత్ర దర్శకుడు నవీన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తూ పనిచేశాను. ఆయన ఎంతో ప్రతిభావంతుడు. ఈ చిత్రం మంచి విజయం సాధించి చిత్ర బృందం అందరికీ మంచి పేరు చూసుకుని రావాలని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.
ఇదెలా ఉంటే, ఉదయ్ కిరణ్-ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన చాలా వరకు సాంగ్స్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం