Mahith Narayan on Chakri: టాలీవుడ్ దివంగత సంగీత దర్శకుడు చక్రి ఎన్నో మరపురాని చిత్రాలకు మ్యూజిక్ అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో బాచి అనే సినిమాతో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, కబడ్డీ కబడ్డీ, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన చక్రి 2014లో గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. చక్రి మరణం తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులు తలెత్తాయి. మీడియా వరకు వచ్చి వివాదం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే చక్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తమ్ముడు మహిత్ నారాయణ్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
పరారీ అనే సినిమాకు మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మహిత్.. చక్రి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
"సంగీతంలో నాకు ఓనమాలు నేర్పింది మా అన్నయ్యే. ఆయనే నా గురువు. ఆయనతో పాటు ఉంటూ చెప్పిన పని చేయడం వల్ల నాకు ఈ పని తెలిసింది. నేను వారసుడిగా కొనసాగాలని ఆయన కోరుకున్నారు. అయితే అన్నయ్య మరణం తర్వాత ఎలా జీవించాలి? అని చాలాసార్లు అనిపించింది. కానీ ఆయన వారసుడిగా నిలబడాలని, అన్నయ్య కలను సాకారం చేయాలని భావించి కష్టాలను తట్టుకుని నిలబడ్డాను. అన్నయ్య మరణం నాకు ఓ పాఠం నేర్పింది. మరింత మొండిగా బతకడం నేర్చుకున్నాను." అని మహిత్ చెప్పారు.
చక్రి మరణం తర్వాత కుటుంబంలో ఆస్తి వివాదాలపై మహిత్ స్పందించారు. "అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు తలెత్తాయి. ఓ వైపు ఆయన లేడనే బాధ.. మరోవైపు ఈ ఆస్తి తగాదాలతో నరకం అనుభవించాం. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆయన భార్య అమ్మేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే ఇంకొకరి వివాహం చేసుకుని స్థిరపడింది. ఆమెతో మాకెలాంటి సంబంధాల్లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు పరిధిలో ఉన్నాయి." అని మహిత్ తెలిపారు.
ఎన్నో సూపర్ హిటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన చక్రి 2014లో గుండెపోటుతో మరణించారు. ఆయన కెరీర్లో ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. సింహా చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నంది పురస్కారం అందుకోగా.. సత్యం సినిమాలో ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకున్నారు.