Mollywood vs PVR: దేశవ్యాప్తంగా మలయాళ సినిమాల హవా నడుస్తున్న ఈ రోజుల్లో పీవీఆర్ ఐనాక్స్ తీసుకున్న నిర్ణయం షాక్కు గురి చేస్తోంది. ఈ మల్లీప్లెక్స్ చెయిన్ దేశవ్యాప్తంగా మలయాళ సినిమాల ప్రదర్శనలు నిలిపేసింది. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ పైనా పడింది. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కేఎఫ్పీఏ)తో విభేదాలే దీనికి కారణంగా కనిపిస్తోంది.
పీవీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మలయాళ లేటెస్ట్ సినిమాలు ఆవేశం, వర్షంగలక్ శేషం, ఆడుజీవితం, జై గణేష్, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు కూడా తీవ్రంగా నష్టోతున్నాయి. ఒక్క కేరళలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పీవీఆర్ ఇదే నిర్ణయం తీసుకుంది. చివరికి మలయాళం నుంచి వివిధ భాషల్లోకి డబ్ అయిన సినిమాలనూ నిలిపేసింది.
తెలంగాణలో మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ను పీవీఆర్ నిలిపేయడంపై మైత్రి మూవీస్ కు చెందిన శశిధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేశారు. కేరళలో ప్రొడ్యూసర్లతో గొడవ ఉంటే.. ఇక్కడ షోలను నిలిపేయడమేంటని ప్రశ్నించారు. మంజుమ్మల్ బాయ్స్ కు మంచి కలెక్షన్లు వస్తున్న తరుణంగా ఇలా నిలిపేయడం సరి కాదని అన్నారు. దీనిపై అత్యవసర సమావేశానికి డిమాండ్ చేశారు.
కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఈ మధ్య తీసుకున్న ఓ నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. ఆ అసోసియేషన్ ఓ కంటెంట్ ప్రొవైడింగ్ సంస్థను ఏర్పాటు చేసి కేరళలోని థియేటర్లు వాళ్ల నుంచే కొత్త సినిమాలను తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే దీనిపై పీవీఆర్ ఐనాక్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి నుంచీ కేరళతోపాటు దేశవ్యాప్తంగా మలయాళ సినిమాల ప్రదర్శన నిలిపేసింది.
దీనిపై పీవీఆర్ పిక్చర్స్ లిమిటెడ్ సీఈవో కమల్ జ్ఞాన్ చందానీ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. "పీవీఆర్ ఫోరమ్ కొచ్చిలోని మా కొత్తగా ప్రారంభించిన 9 స్క్రీన్ సినిమాను ఒకే ఛానెల్ ద్వారా మూవీ కంటెంట్ కొనుగోలు చేయాల్సిందిగా అక్కడి అసోసియేషన్ సూచించింది. ఓ ఎగ్జిబిటర్ ను కేవలం ఒకే సోర్స్ నుంచి కంటెంట్ ను కొనాలనడం చట్ట విరుద్ధం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చట్టాలను అనుసరించే సంస్థగా మేము ఈ సూచనను పాటించలేము" అని అందులో స్పష్టం చేశారు.
అయితే తమ మల్టీప్లెక్స్ ల నుంచి మలయాళం సినిమాలను తొలగిస్తున్నట్లు మాత్రం అందులో పీవీఆర్ ఐనాక్స్ చెప్పలేదు. ఈ మల్టీప్లెక్స్ చెయిన్ తీసుకున్న నిర్ణయం వివిధ రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోంది. మలయాళం సినిమాల హక్కులను తీసుకున్న ఆయా రాష్ట్రాల ప్రొడ్యూసర్లు దీని వల్ల నష్టపోతున్నారు.
ఈ మధ్య మలయాళ సినిమాలకు డిమాండ్ పెరగడంతో భారీ మొత్తం చెల్లించి వివిధ భాషల డబ్బింగ్ హక్కులను పొందుతున్నారు. మంజుమ్మల్ బాయ్స్ విషయంలోనూ తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగింది. అయితే ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.