Mohan Babu About Kannappa Story Prabhas: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం (జూన్ 14) నాడు కన్నప్ప టీజర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ (Kannappa Teaser) ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మోహన్ బాబు (Mohan Babu) ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. "కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించాం. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం" అని మోహన్ బాబు అన్నారు.
"శరత్ కుమార్ (Sarathkumar) తీసిన పెదరాయుడు (PEDDARAYUDU Movie) సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం" అని మోహన్ బాబు తెలిపారు.
"ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు (Krishnam Raju) గారితో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ (Prabhas) కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి" అని డాక్టర్ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
"కన్నప్ప సినిమాలో నాకు నా ఆర్టిస్టులే బలం. విష్ణు చేసిన యాక్టింగ్, పడిన కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్ట చలిలోనూ టీం అంతా చలించకుండా పని చేసింది. విష్ణు గారు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అంత డెడికేటెడ్గా పని చేశారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. నా అంచనాలను మించి నటించారు" అని కన్నప్ప మూవీ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ అన్నారు.
"రామాయణం, మహాభారతం మైథాలజీ కాదు. అది మన చరిత్ర. సౌత్, నార్త్ అని ఉండదు. ఓ భక్తుడి కథను చెప్పాం. మనం దేవుడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరుతాం. కానీ ఏం కోరకుండా దేవుడికే నేత్రాలను సమర్పించారు కన్నప్ప. అలాంటి గొప్ప భక్తుడి కథను చెప్పాం. అంతకంటే గొప్ప కథ ఇంకెక్కడ దొరుకుతుంది" అని ముకేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) తెలిపారు.
"కన్నప్ప కేవలం సినిమా కాదు.. మన చరిత్ర. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. ఇంకా ఇప్పటికీ ఆ పాత్రల్లోనే ఉండిపోయాం. చరిత్రను అందరూ మర్చిపోతున్నారు. మనం మన చరిత్రను చెప్పుకోవాలి. కన్నప్పను అందరూ వీక్షించాలి" అని నటుడు శరత్ కుమార్ తన అభిప్రాయాన్ని చెప్పారు.
టాపిక్