Chiranjeevi First Movie Experience: పరువు పోతుందని ఎవరికి చెప్పలేదు - ఫస్ట్ డే ఫస్ట్ షో సీక్రెట్ రివీల్ చేసిన చిరు
Chiranjeevi :చిన్నతనంలో థియేటర్ లో ఫస్ట్ డే సినిమా చూసిన అనుభవాలను మెగా స్టార్ చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పంచుకున్నారు. ఆయన థియేటర్ లో చూసిన ఆ సినిమా ఏదంటే...
Chiranjeevi :ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్ నటించిన రాము సినిమాను మొదటిరోజు థియేటర్ లో చూడటానికి దొంగతనంగా వెళ్లి నాన్న చేతిలో చిత్తుగా తన్నులు తిన్నానని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. పరువు పోతుందనే భయంతో ఇప్పటివరకు తన ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్ పీరియన్స్ ను ఇప్పటివరకు ఎప్పుడు, ఎక్కడ చెప్పలేదని అన్నాడు. బుధవారం జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సినిమా అనుభవాల గురించి యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ‘ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో నెల్లూరులో ఎన్టీఆర్ నటించిన రాము సినిమాను మొదటి రోజు తొలి ఆట చూడటానికి థియేటర్ కు తమ్ముడు నాగబాబుతో కలిసి వెళ్లా. నెల్లూరులో మా బంధువు పూర్ణ ఉండేవాడు. అతడు ఎన్టీఆర్ కు వీరాభిమాని. ప్రతి సినిమాను నేల టికెట్ కొనుక్కొని చూసేవాడు. నాన్న మమ్మల్ని నేల టికెట్ కు కాకుండా కుర్చీ క్లాస్ కు తీసుకెళ్లేవాడు.
నేల టికెట్ కౌంటర్ ఇరుకు గోడలతో ఉంది. టికెట్ కోసం జనమంతా కొట్టుకుంటున్నారు. నాగబాబు చిన్నవాడు, ఎర్రగా ఉండేవాడు. చెమటలు కక్కుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో క్యూ ఆగిపోయింది. వెనక్కి వెళ్లలేక, ముందు రాలేక ఇబ్బందులు పడ్డాం. ఎలాగో టికెట్లు తీసుకొని బయటకు రాగానే నాన్న కనిపించారు. అంతకు ముందు షోలోనే ఆయన రాము సినిమా చూసి బయటకు వస్తున్నారు. నాగబాబు నలిగిపోయి వెర్రిముఖం వేశాడు.
నేల టికెట్ కు వెళుతున్నామని తెలియగానే కోపంతో థియేటర్ స్తంభానికి కట్టిన కొబ్బరి మట్ట తీసి రోడ్ పై కొట్టుకుంటూ మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు ఏవీఎమ్ రాము పేరు వినగానే షివరింగ్ వస్తుంది’ అని చిరంజీవి తెలిపారు. చిరంజీవి చెప్పిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్ పీరియన్స్ తాలూకు జ్ఞాపకాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.