మలయాళం జాంబీ థ్రిల్లర్ మూవీ సమర థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 30 నుంచి సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో రెహమాన్, భరత్, రాహుల్ మాధవ్ హీరోలుగా నటించారు. ఛార్లెస్ జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
2022లో థియేటర్లలో రిలీజైన సమర మూవీ డిఫరెంట్ అటెంప్ట్గా ప్రేక్షకుల మన్ననలను అందుకున్నది. కానీ కమర్షియల్గా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఈ మలయాళం మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.
హిమాచల్ ప్రదేశ్లోని స్నో వ్యాలీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించవు. ఈ సీరియల్స్ మర్డర్స్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే బాధ్యతను ఆంటోనీ (రెహమాన్) చేపడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్లో డాక్టర్ అలన్ దేశంలో బయోవార్కు ప్లాన్ చేశాడనే నిజం బయటపడుతుంది.
ఇందుకోసం మనుషులను జాంబీలుగా మార్చే ఓ వైరస్ను అలన్ కనిపెట్టాడని తెలుస్తుంది. ఈ బయోవార్ను అడ్డుకోవడానికి ఆంటోనీ ఏం చేశాడు. ఈ మిషన్లో ఆంటోనీకి డాక్టర్లు ఆజాద్, జాకీర్ ఎలా సాయం చేశారు? అలన్ కూతురు, భార్య ఎలా చనిపోయారు? అతడి గతం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
సమర మూవీ మలయాళంతో పాటు తమిళం, మలేషియన్ లాంగ్వేజ్లలో రిలీజ్ చేశారు. సమర మూవీతోనే డైరెక్టర్గా పరిచయమయ్యాడు ఛార్లెస్ జోసెఫ్. సైన్స్ ఫిక్షన్ కథను అర్థవంతంగా స్క్రీన్పై చెప్పడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు.
మలయాళం, తమిళంతో పాటు తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేశాడు రెహమాన్, భారత్బంధ్, ప్రియతమా, ఆదర్శం సినిమాల్లో హీరోగా నటించాడు. బిల్లా, సింహా, జనతా గ్యారేజ్తో పాటు మరికొన్ని స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మలయాళంలో గత ఏడాది రెహమాన్ నటించిన బ్యాడ్బాయ్స్ పెద్ద హిట్టయ్యింది.
సంబంధిత కథనం