మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది అక్టోబర్ లో వచ్చిన సంచలన విజయం సాధించిన మూవీ పని (Pani). ప్రముఖ నటుడు జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కాస్త వయోలెన్స్ ఎక్కువైనా.. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా ఊహకందని క్లైమ్యాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానున్నట్లు జోజు జార్జ్ కన్ఫమ్ చేశాడు.
జోజు జార్జ్ ఇప్పటికే ఎన్నో మలయాళం సినిమాల్లో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. అయితే పని మూవీతో తొలిసారి డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు అతడు వెల్లడించాడు. అంతేకాదు మొత్తంగా మూడు భాగాలు రానున్నట్లు కూడా చెప్పడం విశేషం.
పని 2 మూవీని కన్ఫమ్ చేయడమే కాదు.. ఇది తొలి భాగం కంటే మరింత తీవ్రంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పాడు. అయితే తొలి పార్ట్ తో ఎలాంటి డైరెక్ట్ లింక్స్ ఉండవని కూడా తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయ్యిందట. షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.
ఈ పని 2 కోసం పూర్తిగా కొత్త లొకేషన్లు, కొత్త నటీనటులు రాబోతున్నారు. దేశంలోని ప్రముఖ సాంకేతిక సిబ్బంది ఈ సినిమా కోసం పని చేయబోతున్నట్లు కూడా తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్ లో పని 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఆ తర్వాత పని 3 కూడా రానుంది.
ఆ నగరాన్ని శాసించే ఓ గ్యాంగ్స్టర్, అతని సహచరుల కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా ఓ రోజు ఇద్దరు యువకులు వస్తారు. ఎలాంటి భయం, బెదురు లేని వాళ్లు అప్పటికే ఓ ఏటీఎంలోనే హత్య చేసి ఉంటారు. అలాంటి యువకుల నుంచి ఆ కుటుంబానికి ఎదురైన సవాలేంటి?
త్రిసూర్ నే ఏలే అలాంటి కుటుంబంతో వాళ్లు ఎలా ఆడుకుంటారన్నది ఈ పని మూవీలో చూడొచ్చు. అయితే ఇందులో ఊహకందని క్లైమ్యాక్స్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. కాస్త వయోలెన్స్ ఎక్కువే. ఇప్పుడు పని 2 మరింత తీవ్రంగా రాబోతున్నట్లు జోజు జార్జ్ చెప్పడం చూస్తే.. అందులో ఇంకా ఏం చూపిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం