OTT Malayalam Action Thriller: మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ, అత్యంత వివాదాస్పదంగా మారిన ఎల్2: ఎంపురాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (ఏప్రిల్ 17) జియోహాట్స్టార్ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో అతనితోపాటు లీడ్ రోల్లో మోహన్ లాల్ నటించిన మూవీ ఎల్2: ఎంపురాన్. బాక్సాఫీస్ దగ్గర రూ.250 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. వచ్చే గురువారం (ఏప్రిల్ 24) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నెల రోజుల్లోపే మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుండటం విశేషం.
ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “అబ్రహం ప్రపంచం ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఎల్2: ఎంపురాన్ ఏప్రిల్ 24 నుంచి కేవలం జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఎల్2: ఎంపురాన్ మూవీ మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. 2019లో వచ్చిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే అదే సమయంలో వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. 2002లో జరిగిన గుజరాత్ గోద్రా అల్లర్లను మూవీలో చూపించడంపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. దీంతో సినిమాలో లీడ్ రోల్ పోషించిన మోహన్ లాల్ కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
మూవీలో ఏకంగా 24 కట్స్ చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే వివాదాలు ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దూసుకెళ్లింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా ఎల్2: ఎంపురాన్ చరిత్ర సృష్టించింది. గతేడాది మంజుమ్మెల్ బాయ్స్ క్రియేట్ చేసిన రికార్డును తిరగరాసింది. మొత్తానికి ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచే జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం