Mahesh Babu shares Mother's Photo: అంత్యక్రియల తర్వాత తల్లి ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు
Mahesh Babu shares Mother's Photo: అంత్యక్రియల తర్వాత తల్లి ఇందిరా దేవి ఫొటో షేర్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇది ఆమె యవ్వనంలో దిగిన ఫొటో కావడం విశేషం.
Mahesh Babu shares Mother's Photo: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం (సెప్టెంబర్ 28) ఉదయం కన్నుమూసిన విషయం తెలుసు కదా. ఆమె మరణంతో మహేష్ దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఉదయం నుంచీ అతడు అంతులేని విషాదంలో మునిగిపోయాడు.
తల్లికి అతడే తలకొరివి పెట్టాడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అమ్మను గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో షేర్ చేశాడు. హార్ట్ ఎమోజీలే క్యాప్షన్గా ఈ ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇందిరా దేవి యవ్వనంలో ఉన్నప్పటిది. అతడు ఈ ఫొటో షేర్ చేసిన గంటలోనే లక్షల కొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. చాలా మంది అభిమానులు మహేష్ను ఓదారుస్తూ కామెంట్లు చేశారు.
స్టే స్ట్రాంగ్ అన్నా అంటూ వాళ్లు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. అటు ట్విటర్లోనూ #StayStrongAnna హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. బుధవారం ఉదయం తల్లి మరణం తెలిసినప్పటి నుంచీ మహేష్ ఏడుస్తూనే కనిపించాడు. అతని కూతురు సితార కూడా నాన్నమ్మ మరణాన్ని తట్టుకోలేకపోయింది. తల్లి నమ్రతా ఓదారుస్తున్నా.. సితార మాత్రం దుఃఖం ఆపుకోలేకపోయింది.
70 ఏళ్ల ఇందిరా దేవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుఝామున కన్నుమూశారు. ఆమె మృతి విషయం తెలిసి టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వాళ్ల ఇంటికి వెళ్లి కృష్ణ, మహేష్లను ఓదార్చారు.
ఇక టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, మోహన్బాబు, త్రివిక్రమ్, కొరటాల శివ, తమన్, అశ్వినీదత్, అడివి శేష్ కూడా ఇందిరా దేవి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత కృష్ణ, మహేష్లను కలిసి ధైర్యం నూరిపోశారు. అటు కృష్ణ కూతురు, మహేష్ బాబు అక్క మంజుల కూడా ట్విటర్లో తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ మనసుకు హత్తుకునే సందేశం రాసింది.
"ప్రియమైన అమ్మ, నువ్వే నా తొలి గురువు, నా పునాది, నా హృదయం. నీ ప్రేమే నాకు రక్షణగా ఉంది. నా జీవితంపై నీ ప్రభావమే ఎక్కువగా ఉంది. మా అమ్మ అంటే ఇవ్వడమే తప్ప తన జీవితంలో ఏదీ అడిగింది లేదు. ఆమె లేకుండా మా చిన్నతనంలో ఒక్క రోజు కూడా గడిచింది లేదు" అని మంజుల ట్విటర్లో రాసింది. ఇందిర కృష్ణ జంటకు ఐదుగురు సంతానం. మహేష్ బాబు, మంజులతోపాటు రమేష్ బాబు, ప్రియదర్శిని, పద్మావతి ఉన్నారు. వీళ్లలో రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో మరణించాడు. ఇక పద్మావతి.. నటుడు సుధీర్ బాబు భార్య.