చిరంజీవితో అనుకొని వెంక‌టేష్‌తో తీశారు - కృష్ణంరాజు కేసుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల్సిన‌ మూవీ డిజాస్ట‌ర్ - ఆ సినిమా ఏదంటే!-lesser known facts about kondapalli raja movie why krishnam raju filed court case against venkatesh movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చిరంజీవితో అనుకొని వెంక‌టేష్‌తో తీశారు - కృష్ణంరాజు కేసుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల్సిన‌ మూవీ డిజాస్ట‌ర్ - ఆ సినిమా ఏదంటే!

చిరంజీవితో అనుకొని వెంక‌టేష్‌తో తీశారు - కృష్ణంరాజు కేసుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల్సిన‌ మూవీ డిజాస్ట‌ర్ - ఆ సినిమా ఏదంటే!

Nelki Naresh HT Telugu

వెంక‌టేష్ హీరోగా న‌టించిన కొండ‌ప‌ల్లి రాజా మూవీని తొలుత చిరంజీవి చేయాల‌ని అనుకున్నారు. సినిమా రిలీజైన త‌ర్వాత రోజే ఈ క‌థ త‌న‌ది అంటూ కృష్ణంరాజు కేసు పెట్టారు. ర‌జ‌నీకాంత్ అన్నామ‌లై రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా చోటు చేసుకున్న ట్విస్ట్‌లు ఏవంటే?

చిరంజీవి, వెంక‌టేష్‌

ఓ హీరోతో సినిమా అనుకొని మ‌రో హీరోతో తీయ‌డం అన్న‌ది ఇండ‌స్ట్రీలో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. అలా వ‌చ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అయ్యాయి. డిజాస్ట‌ర్లుగా నిలిచిన‌వి ఉన్నాయి. ఓ స్టార్ హీరో న టించిన మూవీ ఫ‌స్ట్ డే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నది. కానీ అనూహ్యంగా మ‌రో హీరో పెట్టిన కేసు కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌కు న‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమానే కొండ‌ప‌ల్లి రాజా.

ర‌జ‌నీకాంత్ మూవీ రీమేక్‌...

వెంక‌టేష్ హీరోగా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో 1993లో కొండ‌ప‌ల్లి రాజా మూవీ రిలీజైంది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన అన్నామ‌లై రీమేక్‌గా కొండ‌ప‌ల్లి రాజాను తెర‌కెక్కించారు ర‌విరాజా పినిశెట్టి. తొలుత అన్నామ‌లై రీమేక్‌ను చిరంజీవితో చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ అనుకున్నార‌ట‌.

చిరంజీవికి కూడా క‌థ న‌చ్చ‌డంతో ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ట‌. వెంక‌టేష్‌కు కూడా అన్నామ‌లై క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చార‌ట‌. అప్ప‌టికే వెంక‌టేష్‌తో ఓ సినిమా చేస్తోన్న ఆ ప్రొడ్యూస‌ర్‌...కొండ‌ప‌ల్లి రాజాను కూడా చిరంజీవిని కాద‌ని వెంక‌టేష్‌తోనే రీమేక్ చేయాల‌ని ఫిక్స‌య్యారు.

న‌గ్మా హీరోయిన్‌...

వెంక‌టేష్ మార్కెట్‌కు మించి భారీ బ‌డ్జెట్‌తో కొండ‌ప‌ల్లి రాజాను తెర‌కెక్కించారు. యాక్ష‌న్ డ్రామా మూవీలో సుమ‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌గా... న‌గ్మా హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ కొండ‌ప‌ల్లి రాజా రిలీజైంది.

ఫ‌స్ట్ డే సూప‌ర్ హిట్ టాక్‌...

ఫ‌స్ట్ డేనే ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. కొండ‌ప‌ల్లి రాజా క‌థ త‌న‌ది అంటూ కృష్ణంరాజు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ఈ సినిమా ప్రింట్స్‌ను సీజ్ చేయాలంటూ కృష్ణంరాజు కేసు వేయ‌డంతో రెండో రోజే చాలా థియేట‌ర్ల‌లో నుంచి సినిమాను తీసేశారు.

హిందీ రీమేక్‌...

ర‌జ‌నీకాంత్ అన్నామ‌లై సినిమా హిందీలో ఖుద్‌గ‌ర్జ్ అనే సినిమాకు రీమేక్‌. ఖుద్‌గ‌ర్జ్ తెలుగు రీమేక్ రైట్స్‌ను కృష్ణంరాజు తీసుకున్నారు. ఈ మూవీ ఆధారంగా ప్రాణ స్నేహితులు అనే సినిమా చేశారు. ఆ ప్రాణం స్నేహితులు క‌థ‌నే మ‌రోసారి వెంక‌టేష్ కొండ‌ప‌ల్లి రాజాగా తీశారు.

తెలుగు రీమేక్ హ‌క్కులు త‌న పేరిట ఉండ‌టంతోనే కృష్ణంరాజు కోర్టులో కేసు వేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత కృష్ణంరాజు కాంప్ర‌మైజ్ అయిపోయి కేసు వెన‌క్కి తీసుకున్నారు. అప్ప‌టికే కొండ‌ప‌ల్లి రాజాకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు న‌ష్టం తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ అన్నామ‌లై సినిమా కూడా తెలుగులోకి డ‌బ్ కావ‌డం గ‌మ‌నార్హం.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం