ETV Win OTT: ఒకేరోజు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్న రెండు సినిమాలు
ETV Win OTT Movie: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మరో రెండు కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. రామన్న యూత్, కీచురాళ్లు చిత్రాలు స్ట్రీమింగ్ పెట్టనున్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు అందుబాటులోకి రానున్నాయి.

ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీ కొంతకాలంగా దూకుడు పెంచింది. సినిమాలు, వెబ్ సిరీస్లను వరుసగా తీసుకొస్తోంది. ముఖ్యంగా చిత్రాల విషయంలో జోరు చూపిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలను డబ్బింగ్లో అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కొత్తగా రెండు సినిమాలు అడుగుపెట్టనున్నాయి. రామన్న యూత్, కీచురాళ్లు చిత్రాలు ఒకే రోజు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఆ వివరాలు ఇవే.
రామన్న యూత్ - ఏడు నెలల తర్వాత..
రామన్న యూత్ సినిమా రేపు (మే 30) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. గ్రామీణ నేపథ్యంలో లవ్ పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో అభయ్ నవీన్, అమూల్యా రెడ్డి హీరోహీయిన్లుగా నటించారు. థియేటర్లలో గతేడాది 2023 సెప్టెంబర్ 15వ తేదీనే రామన్న యూత్ చిత్రం రిలీజ్ అయింది. అయితే, ఓటీటీ బయ్యర్లు లేకపోవడంతో స్ట్రీమింగ్కు రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు రామన్న యూత్ మూవీ హక్కులను ఈటీవీ విన్ తీసుకుంది. థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
రామన్న యూత్ చిత్రానికి హీరో అభయ్ నవీనే స్వయంగా దర్శకత్వం వహించారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఆశించిన స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలో ఆడలేదు. ఈ మూవీలో అభయ్, అమూల్యతో పాటు విష్ణో ఓయ్, అనిల్ గీలా, తాగుబోతు రమేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కమ్రాన్ సింగీతం అందించగా.. ఫాహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రాన్ని రేపటి (మే 30) నుంచి ఈటీవీ విన్లో చూసేయవచ్చు.
కీచురాళ్లు - డబ్బింగ్ మూవీ
మలయాళంలో కీడమ్ సినిమా 2022 మేలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత కీచురాళ్లు పేరుతో తెలుగు డబ్బింగ్లో వస్తోంది. కీచురాళ్లు మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్పామ్లో రేపు (మే 30) స్ట్రీమింగ్కు రానుంది. సైబర్ నేరాల చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో రజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నించే ఆఫీసర్ రాధికా బాలన్ పాత్ర చేశారు.
ఈ కీచురాళ్లు (కీడం) మూవీలో శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్, రంజిత్ శేఖర్, ఆనంద్ మన్మందానీ, మహేశ్ నాయర్ కీలపాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాహుల్ విజి నాయర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మలయాళంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్, ఫైరీ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై రాహుల్ రిజి నాయర్, సుజీత్ వారియర్, లిజో జోసెఫ్, రంజన్ ప్రొడ్యూజ్ చేయగా.. సిద్ధార్థ ప్రదీప్ సంగీతం అందించారు.
ఈ రామన్న యూత్, కీచురాళ్లు చిత్రాలను రేపటి (మే 30) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడొచ్చు.