కన్నప్ప వసూళ్లు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా తొలి సోమవారం (జూన్ 30) టెస్టును పాస్ కాలేకపోయింది. తొలి మూడు రోజుల కంటే నాలుగో రోజు వసూళ్లు భారీగా తగ్గిపోయినట్లు Sacnilk.com రిపోర్టు వెల్లడించింది. ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీకి తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఆ తర్వాత అనూహ్యంగా పతనమవుతూ వస్తోంది.
విష్ణు మంచు నటించిన 'కన్నప్ప' మూవీ గత శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు వసూళ్లు ఫర్వాలేదనిపించినా.. తర్వాతి రెండు రోజులు పడిపోతూ వచ్చాయి. నాలుగు రోజు ఇది మరింత పతనమైంది. తొలి సోమవారం ఈ సినిమా కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. Sacnilk.com తాజా రిపోర్టు ప్రకారం 'కన్నప్ప' మూవీ.. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.31.5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
ఇండియాలో గ్రాస్ 27.5 కోట్లు కాగా.. నెట్ వసూళ్లు రూ.25.22 కోట్లుగా ఉంది. ఏకంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలోనే ఉంది. లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్త గ్రాస్ కనీసం రూ.180 కోట్లు ఉండాలని లెక్కగట్టారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
కన్నప్ప తొలి రోజు రూ.9.35 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు రావడంతో శని, ఆదివారాల్లో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని ఊహించారు. కానీ సీన్ రివర్సయింది. రెండో రోజు రూ.7.15 కోట్లు, మూడో రోజు రూ.6.9 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక నాలుగో రోజు సోమవారం కావడంతో ఈ వసూళ్లు మరింత భారీగా పతనమయ్యాయి.
సినిమాకు వచ్చిన రివ్యూలతోపాటు పైరసీ కూడా కన్నప్పను దెబ్బ తీసింది. ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా అంగీకరించాడు. సోమవారం (జూన్ 30) అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ మూవీ పైరసీ బారిన పడినట్లు వెల్లడించాడు. ఇప్పటికే 30 వేల అక్రమ లింకులను తొలగించినట్లు కూడా చెప్పాడు. పైరసీ అంటే దొంగతనమే అని, దీనిని ఎవరూ ప్రోత్సహించకూడదని అతడు కోరాడు.
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన 'కన్నప్ప' చిత్రానికి విష్ణు స్వయంగా కథను అందించగా, మోహన్ బాబు నిర్మించారు. శివుడి భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో మోహన్లాల్, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, ఆర్. శరత్కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మండ, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సంబంధిత కథనం