థ్రిల్లర్ సినిమాలంటే మలయాళం ఇండస్ట్రీ నుంచే వచ్చేవి అనుకుంటాం కానీ.. అప్పుడప్పుడూ పలు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటిదే ఈ కన్నడ మూవీ కేస్ ఆఫ్ కొండానా (Case of Kondana).
నేరం చేసిన ఓ పోలీసు.. అందులో నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నంతోపాటు ఓవైపు సీరియల్ కిల్లర్, మరోవైపు కొడుకును బతికించుకోవడానికి ఓ పానీ పూరీ అమ్ముకుంటూ బతికే కుటుంబం.. ఇలా ఒకే సమయంలో జరిగే వివిధ కథలను కలుపుకుంటూ సాగే మూవీ ఇది.
కేస్ ఆఫ్ కొండానా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక వ్యక్తి లేదా ఒకే కథతో సాగే మూవీ కాదు. లంచం ఇచ్చి మరీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందే ఓ ఏఎస్సై, డాక్టర్ అయిన అతని గర్ల్ఫ్రెండ్, ఓ రౌడీ గ్యాంగ్, అందులోనే ఉండే ఓ సీరియల్ కిల్లర్, అతన్ని చంపే ఓ ఏసీపీ, వీళ్లందరి మధ్య తమ కొడుకును బతికించుకోవడానికి ఓ నిరుపేద కుటుంబం పడే బాధలు.. ఇలా అన్నింటినీ కలుపుతూ సాగిపోయే స్టోరీయే కేస్ ఆఫ్ కొండానా.
అసలుసిసలు థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే ఏసీపీ లక్ష్మి (భావన మేనన్) స్టోరీతో ఈ మూవీ మొదలవుతుంది. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఏఎస్సైగా వస్తాడు విల్సన్ (విజయ్ రాఘవేంద్ర). తొలి రోజే పోలీస్ స్టేషన్ ముందే ఓ గూండాతో గొడవపడతాడు. మరోవైపు అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించే ఓ నిరుపేద కుటుంబాన్ని కూడా మొదట్లోనే పరిచయం చేస్తారు. ఆ పిల్లాడికి విల్సన్ గర్ల్ఫ్రెండ్ అయిన డాక్టర్ సహానా (ఖుషీ రవి)నే చికిత్స చేస్తుంటుంది.
మొదట్లో ఈ కథలన్నీ వేర్వేరుగా సాగిపోతున్నట్లుగా అనిపిస్తాయి. సీరియల్ కిల్లర్ అనే కాన్సెప్ట్ కావడంతో మూవీ మొత్తం దాని చుట్టే తిరుగుతుందనీ అనుకుంటాం. కానీ ఏఎస్సై విల్సన్ ఊహించని పరిస్థితుల్లో చేసే ఓ హత్య సినిమాను మరో మలుపు తిప్పుతుంది.
ఆ హత్యతోనే ఈ కథలన్నీ ఎలా కలుస్తాయన్నదే ఈ కేస్ ఆఫ్ కొండానా మూవీ. అతడు చేసే ఆ హత్య మరికొందరు పోలీసుల మరణానికి ఎలా కారణమవుతుంది? తాను చేసిన ఈ హత్యను కప్పి పుచ్చుకోవడానికి విల్సన్ చేసే ప్రయత్నాలు ఏంటి? ఇందులో తన తండ్రిని కోల్పోయిన ఏసీపీ లక్ష్మి ఏం చేయబోతోంది?
అప్పటికే తమ గ్యాంగ్ లోని సీరియల్ కిల్లర్ ను చంపిన ఏసీపీ లక్ష్మిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న రౌడీ గ్యాంగ్ ఈ కథలో తీసుకొచ్చే ట్విస్ట్ ఏంటి అన్నది కేస్ ఆఫ్ కొండానా మూవీలో చూడొచ్చు.
ఈ కేస్ ఆఫ్ కొండానా మూవీ గతేడాది జనవరి 26న థియేటర్లలో రిలీజైంది. దేవీ ప్రసాద్ శెట్టి ఈ మూవీకి కథ అందించి డైరెక్ట్ చేశాడు. సినిమాను కూడా అతడే నిర్మించాడు. విజయ్ రాఘవేంద్రతో కలిసి 2021లో ఇదే దేవీప్రసాద్.. సీతారం బినోయ్ అనే మరో మూవీ తీసినా అది ఫ్లాపయింది.
అయితే ఈ కేస్ ఆఫ్ కొండానాను మాత్రం అతడు గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాలో లోపాలు లేవని కాదు కానీ.. మూవీ చివరి గంటా 15 నిమిషాలు అందించే థ్రిల్ ముందు వాటిని మరచిపోవచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీతో మాత్రం యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.
సంబంధిత కథనం