ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి (Agnyathavasi). ఈ కన్నడ మూవీ ఈ నెల 11నే థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అసలు సినిమా కథేంటన్న వివరాలు చూద్దాం.
జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. మే 16 నుంచి జీ5లోకి ఈ సినిమా రానుంది. అయితే ఈ మధ్యకాలంలో జీ నెట్వర్క్ సొంతం చేసుకున్న సినిమాలు ఒకేసారి ఇటు ఓటీటీ, అటు టీవీలోకి వస్తున్నాయి.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మ్యాక్స్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇలాగే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అజ్ఞాతవాసిని కూడా ఇలాగే తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు ఈ కన్నడ మూవీ తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుందా అన్నదానిపైనా ఎలాంటి స్పష్టత లేదు.
కన్నడ మూవీ అజ్ఞాతవాసి ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాను హేమంత్ రావ్ తన దాక్షాయిని టాకీస్ బ్యానర్లో నిర్మించారు. ఇందులో రంగాయన రఘు, రవిశంకర్ గౌడ, శరత్ లోహితశ్వ, సిద్దు మూలిమాని, పావన గౌడలాంటి వాళ్లు నటించారు. ఇది 1990ల నేపథ్యంలో సాగే కథ. కర్ణాటకలోని మల్నాడ్ అనే ఊళ్లో జరుగుతుంది. అక్కడ ఓ భూస్వామి అనుమానాస్పద స్థితిలో కన్నుమూస్తాడు. అయితే స్థానిక సీఐ మాత్రం అది హత్యగా భావిస్తాడు.
అసలు అతనికి అది హత్య అని ఎందుకు అనిపించింది? దీనిని అతడు నిరూపించగలడా? చివరికి ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. 25 ఏళ్లుగా ఎలాంటి నేరం లేని ఆ ఊళ్లో సడెన్ గా జరిగిన ఈ ఘటన ఆ ఊళ్లో వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిందన్నది కూడా ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఐఎండీబీలో 8.6 రేటింగ్ తోపాటు పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ అజ్ఞాతవాసి మూవీ జీ5 ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం