టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మల్టీస్టారర్ స్పై యాక్షన్ మూవీకి క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఈ చిత్రంతోనే బాలీవుడ్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. వార్కు సీక్వెల్గా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు అయాన్ ముఖర్జీ. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో వార్ 2 రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ కొన్నాళ్లుగా నెలకొంది. అయితే, విడుదల తేదీని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించేసింది. అయితే, రజినీకాంత్ ‘కూలీ’ పోటీలో ఉంటుందా అనే అంశం ఇప్పుడు మరో చర్చలా మారింది.
వార్ 2 చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. ఆరోజున థియేటర్లలో విధ్వంసమే అంటూ పేర్కొంది. వార్ 2 నుంచి ఇప్పటి వరకు ఒక్క గ్లింప్స్ కూడా రాలేదు. అప్పుడే విడుదల తేదీని మూవీ టీమ్ ఖరారు చేసేసింది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కూలీ’ కూడా ఇండిపెండెన్స్ డేనే టార్గెట్ చేసుకుంది. ఆగస్టు 14 విడుదల చేయాలని ఆ మూవీ టీమ్ కూడా భావిస్తోందని ఇటీవల అంచనాలు బయటికి వచ్చాయి. అందుకు తగ్గట్టే షూటింగ్ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారట ఈ మూవీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. వార్ 2 వాయిదా పడుతుందేమోననే భావన కూడా ఉండింది.
వార్ 2 మూవీ ఆగస్టు 14నే వస్తుందనే ప్రకటన రావడంతో కూలీ చిత్రం రిలీజ్ ప్లాన్ను మార్చుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే వార్ 2 మూవీకి పాన్ ఇండియా రేంజ్ మరింత ఎక్కువ క్రేజ్ ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద చిత్రాలు పోటీ పడితే మంచిది కాదని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కూలీని వార్ 2కు ఒక వారం ముందో.. వెనుకో రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ దిశగా రెండు మూవీ టీమ్ల మధ్య చర్చలు కూడా సాగినట్టు రూమర్లు ఉన్నాయి. మరి, వార్ 2 మూవీకి కూలీ బాక్సాఫీస్ వద్ద పోటీగా నిలుస్తుందా.. ప్లాన్ మార్చుకుంటుందా అనేది చూడాలి.
కూలీ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ క్యామియో రోల్లో కనిపించనున్నారు. ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీరోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
వార్ 2 సినిమా షూటింగ్ ఇంకా కాస్త పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేసే ఓ పాటతో పాటు మరికొన్ని సీన్లను చిత్రీకరించాల్సి ఉంది. డ్యాన్స్ రిహార్సల్స్ సందర్భంగా హృతిక్ గాయపడ్డారనే రూమర్లు కూడా బయటికి వచ్చాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొచ్చు. దీంతో ఆగస్టు 14ను రిలీజ్ డేట్గా యశ్ రాజ్ ఫిల్మ్స్ ఖరారు చేసింది. ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందన్న అంశంపై చాలా క్యూరియాసిటీ నెలకొంది.
సంబంధిత కథనం
టాపిక్